Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం
- మిల్లర్లు సీసీఐతో ఒప్పందం చేసుకోవాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో రైతు సందేహాలను నివృత్తి చేయడానికి జిల్లాకో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.వారి ఫిర్యాదులు, సూచనలు, సలహాలను స్వీకరించాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మిల్లుల యాజమానులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిల్లర్లు వెంటనే సీసీఐతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. మార్కెటింగ్, వ్యవసాయ, పోలీస్, రవాణా, అగ్నిమాపక, తూనికలు, కొలతల శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితుల్లో అకాలవర్షాలకు తడిచే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 8 శాతం తేమ ఉన్న ప్రతి క్వింటాలుకు రూ.5,825 మద్దతు ధర చెల్లించాలని చెప్పారు. 9 శాతం ఉంటే రూ 5,766.75, 10 శాతమైతే రూ 5,708.50, 11 శాతానికి రూ 5,650.25, 12 శాతానికి రూ 5,582 చెల్లించాలని సూచించారు. సీసీఐ సూచించిన 8 శాతం తేమ కన్నా తక్కువగా ఆరుశాతం తేమ ఉంటే మద్దతు ధరకు అదనంగా రూ 116.50, ఏడు శాతం తేమ ఉంటే అదనంగా రూ 58.25 చెల్లించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు రైతులకు చేరేలా ప్రచారం చేయాలని కోరారు.