Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడీ కార్మికుల పింఛన్కు కేంద్రం రూ. 1600 కాదు..
రూ. 16పైసలు ఇచ్చినట్టు నిరూపిస్తే..
ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా
- లేదంటే బండి సంజరు తన పదవులకు రాజీనామా చేయాలి
- దుబ్బాక బస్టాండ్లో చర్చకు సిద్ధం :
మంత్రి హరీశ్ సవాల్
నవతెలంగాణ-సిద్ధిపేట
'అబద్దాల పునాదులపై బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోంది. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. దానికి సోషల్ మీడియాను వేదిక చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛన్ రూ. 2016లో కేంద్రం వాటా రూ. 1600 ఉందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రూ. 1600 కాదు కేవలం రూ.16 పైసలు కూడా లేదు. దీనిపై ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుతో చర్చకు సిద్ధం. కేంద్రం వాటా ఉందని నిరూపిస్తే నా ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తా. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజరు రాజీనామా చేయాలి. దుబ్బాక బస్టాండ్లో చర్చిద్దాం. దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి' అంటూ మంత్రి హరీశ్రావు బీజేపీపై మండిపడ్డారు. సోమవారం సిద్ధిపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ ఓట్ల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. 2018 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గద్దెను కూల్చివేస్తే ఇప్పుడు దుబ్బాకలో కూల్చినట్టు సోషల్ మీడియాలో పెట్టి టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై తమ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసిందనీ, బాధ్యుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. దుబ్బాకలో టౌన్ ప్లానింగ్ భవనం కోసం రూ.3 కోట్లు నిధులు విడుదలయితే అవి తాము తిన్నట్టు ప్రచారం చేస్తున్నారనీ, నయా పైసా కూడా విడుదల కాలేదన్నారు. అలాగే, చేర్వాపూర్ మరెమ్మ టెంపుల్ నుంచి దుంపలపల్లి వరకు డాంబర్ రోడ్డుకు రూ. కోటి నిధులు మంజూరైతే పనులు ప్రారంభించక ముందే మున్సిపల్ కమిషనర్ కాంట్రాక్టర్కు నిధులు మొత్తం విడుదల చేశారని ప్రచారం చేస్తున్నారనీ, అసలు కాంట్రాక్టరే ఫైనల్ కాలేదని తెలిపారు. బీజేపీ నాయకుల గ్లోబల్ ప్రచారానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్టులో కూడా కేంద్రం వాటా రూ. 8వేలు ఉందని బీజేపీ కార్పొరేటర్ ప్రచారం చేస్తే, ఆ పార్టీ కరపత్రాల్లో రూ.ఆరు వేలని ఉందని, నిధులపై వారికే సరైన అవగాహన లేదన్నారు. బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రజలపై ప్రేముంటే రాష్ట్రానికి రావాల్సిన రూ. పది వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి పంపితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దుబ్బాక ప్రజలు తెలివైన వారనీ, బీజేపీ తప్పుడు ప్రచారాలను నమ్మరని తెలిపారు. హుజూర్నగర్, నిజామాబాద్లో వచ్చిన ఫలితాలే దుబ్బాకలోనూ పునరావృతం అవుతాయని చెప్పారు.