Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణనష్టాన్ని నివారించడానికి చర్యలు
- సహాయక చర్యల పర్యవేక్షణకు
- 80మంది స్పెషల్ ఆఫీసర్లు
- ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్లను అప్రమత్తం చేశాం : మంత్రి కేటీఆర్
- జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
'చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం నమోదైంది. వందేండ్ల తర్వాత భారీ ఉత్పాతం సంభవించింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. వరద సహాయj చర్యలు, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి 80 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. వరద సహాయంగా రూ.1350 కోట్లు ఇవ్వాలని ప్రధాన మంత్రిని కోరాం. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. బోట్ల కోసం ఏపీ, కర్నాటకకు చెందిన సీఎస్లతో సోమేశ్కుమార్ మాట్లాడుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్లను సైతం సిద్ధం చేశాం. అవసరమైన హెలిక్యాప్టర్లను సైతం వినియోగించనున్నాం. వర్షం వస్తోందని ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేదు' అని పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరద సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం మేయర్ బొంతురామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేశ్కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్కంపాటిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్ నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం నమోదైందని కేటీఆర్ తెలిపారు. 1908 సెప్టెంబర్ 28న 24గంటల్లో 43 సెంటిమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైందని, 1916లో ఏడాదంతా 140 సెంటి మీటర్ల వార్షిక వర్షపాతం నమోదైందని తెలిపారు. హైదరాబాద్ నగరం వార్షిక సగటు వర్షపాతం 77.9 సెంటిమీటర్లు. అయితే 2020లో ఇప్పటికే 120 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదైందన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈసారి ఘట్కేసర్లో 32 సెంటిమీటర్లు, చర్లపల్లిలో 30సెం.మీ వర్షపాతం ఒకేరోజు నమోదైందని గుర్తుచేశారు. ఇలాంటి భారీ ఉత్పాతాలు వందేండ్లకొకసారి సంభవిస్తాయని తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. కుములోనింబస్ మేఘాల వలన ఆకాశం చిల్లుపడినట్టు కుండపోతగా వర్షం కురిసిందన్నారు.
ముంపులో 37వేల కుటుంబాలు
పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ పరిధితోపాటు శివారుప్రాంతాల్లో 37 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయని కేటీఆర్ అన్నారు. వారందరికీ సీఎం రిలీఫ్ కిట్లను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి కిట్లో రూ.2,800 విలువైన నిత్యావసర వస్తువులు, 3 బ్లాంకెట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 18,700 కిట్లు పంపిణీ చేశామని, సోమవారం రాత్రి వరకు మిగిలిన కిట్లను అధికారులు పంపిణీ చేస్తారని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, క్రిమిసంహారకాలను స్ప్రే చేస్తున్నామని చెప్పారు. వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు, పునరావాస పనులలో జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ, రెవెన్యూ, పోలీసు, డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు.
33 మంది మృతి
వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీ, శివారుప్రాంతాల్లో 33 మంది మృతిచెందారని కేటీఆర్ తెలిపారు. 29మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో చెల్లించామని, మరో నాలుగు కుటుంబాలకు చెల్లించాల్సి ఉందన్నారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారని, వారిని గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాదకరంగా మారిన శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేస్తున్నామని, 540 భవనాలను గుర్తించగా 180భవనాలను కూల్చేశారని, వారం రోజుల్లో 59 భవనాలను అధికారులు కూల్చేశారని తెలిపారు. కొన్ని పాత భవనాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న 920 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టామని చెప్పారు. ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు చెప్పారు.
నాలాలు ఆక్రమణకు గురయ్యాయి
గ్రేటర్లో చెరువులు, నాలాలు ఆక్రమణ గురయ్యాయనేది వాస్తవమని, ఇదంతా ఒక్క ఘడియలో జరిగింది కాదని, ఎప్పుడెప్పుడు కబ్జాలు చేశారని శాటిలైట్ చిత్రాలతో సహా తమ దగ్గర వివరాలు ఉన్నాయని అన్నారు. వరదకు కారణాల్లో ప్రకృతిప్రకోపం, మానవ తప్పిదాలు, చెరువులు, నాలాల్లో చెత్తా, చెదారం, ప్లాస్టిక్ వేయడం, సమిష్టి తప్పిదమేననీ, అందుకే అందరం అనుభవిస్తున్నామని చెప్పారు. 'ఇదిగో పులి..అదిగో తోక' అంటూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారులకు సహకరించాలన్నారు.
విశ్వనగరాల్లోనూ వరదలు
హైదరాబాద్లోనే కాదని, విశ్వనగరాలు చెప్పుకుంటున్న డల్లాస్, ఇస్తాంబుల్, న్యూయార్క్ నగరాల్లోనూ వరదల వచ్చాయని కేటీఆర్ అన్నారు. వర్షం పడితే అక్కడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడలేవని, మన దేశంలో, మన నగరానికి అనుకూలమైన శాశ్వత పరిష్కారాలను వెతకాల్సిఉందన్నారు. 2005లో తాను ముంబయి వరదల్లో చిక్కుకున్నానని విక్టోరియా నుంచి బాంద్రా వరకు 24గంటలపాటు నడుచుకుంటూ వెళ్లాననీ చెప్పారు.