Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెండోరా/నిజాంసాగర్/ధరూర్
భారీ వర్షాలతో ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. రాష్ట్రంలో, ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం చేరుతుండటంతో 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీఈ జగదీశ్రెడ్డి మంగళవారం తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న 68,481 క్యూసెక్కుల నీటిని 8గేట్ల ద్వారా 25వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా 3వేలు, కాకతీయ కాలువకు 3వేలు, లక్ష్మీ కాలువకు 300, సరస్వతి కాలువకు 500ల క్యూసెక్కుల నీటిని సాగు కోసం విడుదల చేస్తున్నారు. జూరాలకు నారాయణపూర్ డ్యాం నుంచి 48 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు 3,45,500 క్యూసెక్కుల నీరు రాగా, ప్రస్తుతం నీటి మట్టం 317.650మీ. దాంతో ప్రాజెక్టులో 7.640 టీిఎంసీలు నిల్వ ఉంచి 23 గేట్ల ద్వారా 3,28,770 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
నిజాంసాగర్కు తగ్గిన వరద
నిజాంసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 4,047 క్యూసెక్కుల నీరు రావడంతో ఒక గేటుతో నీటిని దిగువ మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు.