Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ
- వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లో వరదల కారణంగా ఇండ్లు మునిగిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికీ లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్నార్సీ డిమాండ్ చేశారు. ఇల్లు కూలిపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. వరదల్లో మునిగిపోయిన బస్తీల్లో మంగళవారం అన్సారీతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్ తదితరులు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో దాదాపు లక్ష కుటుంబాల వరకు వరదలతో నిరాశ్రయులయ్యాయని చెప్పారు. 29 మంది మరణించినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, రూ.1000కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, ఇండ్లలోని వస్తువులన్నీ మునిగిపోయాయని, వాహనాలు నీటిలో కొట్టుకుపోయి, పేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నారని వివరించారు. ఈ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కూడా సరిపోవని బాధితులు చెబుతున్నారని అన్నారు. ఇంట్లో బట్టలు సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో కుటుంబాలు నడిరోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లను కోల్పోయి వారికి ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించివ్వాలని డిమాండ్ చేశారు. దాతలు పెద్ద మనసుతో సహకరించాలని, సాయం చేయాలనుకునేవారు ఆవాజ్ రాష్ట్ర కమిటీని 9490098032లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.