Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న తెలంగాణను ఆదుకునేం దుకు ఢిల్లీ సర్కార్ ముందుకొచ్చింది. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్... రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణకు... ఢిల్లీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీనిచ్చారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ... రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె మంగళవారం లేఖ రాశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం పట్ల ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేజ్రీవాల్, మమతా బెనర్జీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారతతో సాయమందినందుకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్ సీఎంలకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రూ.10 కోట్ల విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామికి కూడా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.