Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపు
- ఆపదొచ్చినా సొంతూరికి వెళ్లలేని దుస్థితి
- కాంట్రాక్టు అధ్యాపకుల మనోవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు బదిలీల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. 10 నుంచి 13ఏండ్లుగా ఒకేచోట పనిచేయ డం వల్ల కుటుంబాలకు దూరంగా ఉంటూ మనోవేదన చెందుతున్నారు. కిలోమీటర్ల దూరంలో పనిచేస్తుండడం వల్ల సెలవులొచ్చినా, శుభకార్యాలకు, ఆపద వచ్చినా సొంతూరికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రోజు విడిచి రోజు కాలేజీలకు అధ్యాపకులు వెళ్లాలి. కానీ దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అది ఇబ్బందిగానే మారింది. సొంతూరికి వెళ్లలేక, అక్కడే నివాసముండలేక మానసిక వేదనకు గురవుతున్నారు. అటు సర్వీసు క్రమబద్ధీ కరణ సమస్య పరిష్కారం కాలేదు. నెలనెలా జీతాలూ రావడం లేదు. కనీసం బదిలీలైనా అవుతాయనుకుంటే అదీ నెరవేరడం లేదు. బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలనీ, బదిలీలకు అనుమతి ఇవ్వాలనీ కోరుకుంటున్నారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు
రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిలో 3,800 మంది వరకు కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ ఆ ప్రక్రియ జరగలేదు. 2008లో చేరిన కాంట్రాక్టు అధ్యాపకులు ఇప్పటి వరకు ఒకే కళాశాలలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైతే రెండేండ్లు అనుభవం ఉంటే బదిలీకి అర్హులు. ఐదేండ్లు ఒకేచోట పనిచేస్తే కచ్చితంగా బదిలీ కావాల్సిందే. కానీ కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రం 10 నుంచి 13ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. గతేడాది కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయాల (కేజీబీవీ)ల్లో పనిచేసిన వారికి స్థానచలనం కల్పించారు. గురుకులాల్లో పని చేస్తున్న సీఆర్టీలనూ బదిలీలు చేశారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాప కుల బదిలీలు జరిగాయి. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాం ట్రాక్టు అధ్యాపకులకు అది చేపట్టలేదు. బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి, విద్యా మంత్రికి, ఇంటర్ విద్యాకమిషనర్కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. ఇంకోవైపు ఈ బదిలీలు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండబోదని కాంట్రాక్టు అధ్యాపకులు చెప్తున్నారు. న్యాయ సమస్య ఉత్పన్నం కాబోదని వివరిస్తున్నారు.
736 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న : సిహెచ్ కృష్ణ
మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ (బాలురు)లో 2009 నుంచి 13 ఏండ్లు గా పనిచేస్తున్నాను. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తే ఖమ్మం వరకే 736 కిలో మీటర్లు. బస్సులో వెళ్తే 450 కిలోమీటర్ల దూరం ప్రయాణిం చాలి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే. ఇప్పుడు వారికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. మా ఆవిడకు వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఒక్కరే ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలాసార్లు ప్రభుత్వానికి, ఇంటర్ విద్యా కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేదు. బదిలీలు చేయాల్సిందే. ఉద్యోగ భద్రత అవసరమే. కానీ అది వచ్చేలోపు మా ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నది. దూర ప్రయాణం కావడం వల్ల సెలవులొచ్చినా, శుభకార్యాలయాలకు, ఆపద సమయంలోనూ సొంతూరికి వెళ్లలేని పరిస్థితి ఉన్నది.
11 ఏండ్లుగా ఒకేచోట : ఎం రజిత
మాది హన్మకొండ. కానీ 350 కిలోమీటర్ల దూరంలో ఆసిఫాబాద్ జిల్లా కౌతాల కళాశాలలో పనిచేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లకోసారి బదిలీలు జరుగుతాయి. మాకు 11 ఏండ్లయినా ఎందుకు ఒకేచోట పనిచేయాలి. కనీసం బదిలీలు చేపట్టరా?. చావు బతుకుల మధ్య మానసిక బాధతో పనిచేస్తున్నాం.
సీఎం స్పందించి న్యాయం చేయాలి : శ్రీనివాస్
మాది జగిత్యాల జిల్లా కోరుట్ల. నేను 250 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో పనిచేస్తున్నాను. మా ఆవిడ మెట్పల్లిలో ఉపాధ్యాయు రాలు. మా అమ్మానాన్న అక్కడే ఉంటారు. కుటుంబం ఒకచోట, నేను ఇంకోచోట. కాంట్రాక్టు లెక్చరర్లకు స్థానచలనం కల్పించాలి. ఐదేండ్లు నిండిన వారిని బదిలీ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,500 ఖాళీలున్నాయి. బదిలీ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మా సమస్యల పై దృష్టిసారించాలి. దసరా సెలవుల్లో బదిలీలు చేస్తే ఇబ్బంది ఉండదు. కాలేజీలు ప్రారంభమైతే ఇబ్బంది ఉంటుంది.
మేం ఏం పాపం చేశాం : పావని
మాది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ. 210 కిలోమీటర్ల దూరంలో వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో పనిచేస్తున్నాను. 11 ఏండ్లుగా ఒకేచోట ఉంటున్నాను. నేను గుండె సమస్యతో బాధపడుతున్నాను. బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాల్సి వస్తున్నది. అందరికీ దూరంగా ఉండడం కష్టంగా ఉన్నది. మేం ఏం పాపం చేశాం. ఏండ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఒకేచోట ఎలా పనిచేయాలి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు న్యాయం చేయాలి.
సొంతూరికి వెళ్లలేకపోతున్నాం : ఎ లక్ష్మీపతి
మాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. ఐదేండ్లుగా 530 కిలోమీటర్ల దూరంలో అశ్వరావుపేటలో పనిచేస్తున్న. కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నాం. ఎవరైనా చనిపో యినా, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యమొచ్చినా వెళ్లలే ని పరిస్థితి.