Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి...
- నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు:తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు విడతలుగా కురిసిన అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. ఈ క్రమంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలనీ, పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ విలేకర్లతో మాట్లాడారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు 3.30 లక్షల ఎకరాల్లోనూ, సెప్టెంబర్ వర్షాలకు ఉత్తర తెలంగాణలోని 2 లక్షల ఎకరాల్లోనూ, అక్టోబర్లో 3 లక్షల ఎకరాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. కల్లాల్లోని వరి ధాన్యం నీట మునిగిపోయిందనీ, అనేక జిల్లాల్లో పంటకు మొలకలు వచ్చాయనీ తెలిపారు. కోతకొచ్చిన వరి, పత్తి బాగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వల్ల ఇండ్లుకూలి 50 మందికి పైగా మరణించారని చెప్పారు. పిడుగులు పడి మనుషులతోపాటు పశువులూ చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు వచ్చిన ధాన్యం సైతం మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పత్తి చేలు గులాబీ రంగుకు మారిపోయాయని చెప్పారు. ఇంత భారీ నష్టం వాటిల్లినప్పటికీ ప్రభుత్వంలో ఎంతమాత్రమూ కదలిక లేకపోవటం బాధాకరమని అన్నారు. పంట నష్టం వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దష్ఠికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ 33 వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయని వారు చెప్పారు. వ్యవసాయరంగాన్ని డైనమిక్ శాఖగా మారుస్తానన్న ముఖ్యమంత్రి...వేల కోట్ల పంట నష్టపోతున్నా స్పందించటం లేదని విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవటానికి రెవెన్యూ శాఖలోని 'డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్' ద్వారా గణాంకాలు సేకరించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం వివరాలను వెంటనే కేంద్రానికి తెలియజేయటం ద్వాఆర కేంద్ర బృందాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.