Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మహిళను కొట్టి చంపిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి:ఐద్వా, గిరిజన సంఘాల డిమాండ్
నవతెలంగాణ - అడవిదేవులపల్లి
'రక్షించాల్సిన పోలీసులే..భక్షకులుగా మారి గిరిజన మహిళను దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక చనిపోయింది. దీనికి బాధ్యుడైన ఎస్ఐ నాగుల్మీరాను వెంటనే సస్పెండ్ చేయాలి' అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆశాలత, మల్లు లకిë, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం నాయక్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉషాయిపాలెంలో పోలీసుల దెబ్బలకు తాళలేక మృతిచెందిన గిరిజన మహిళ కుటుంబాన్ని పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సారా కాస్తుందనే నెపంతో ఈ నెల 16న గిరిజన మహిళ సక్రిని పోలీసులు నల్లగొండలోని పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లి విపరీతంగా కొట్టారని తెలిపారు. దెబ్బలకు తాళలేక ఆమె 17వ తేదీన మృతిచెందిందని చెప్పారు. మహిళ సారా కాస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపర్చాల్సిన పోలీసులు పాశవికంగా దాడి చేయడం సరికాదన్నారు. దీనికి కారణమైన పోలీసులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకొని బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
మట్టి మనిషి పాండు రంగారావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి నాయక్, జిల్లా అధ్యక్షులు రవి నాయక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడారు. సారా అమ్ముతుందనే నెపంతో గిరిజన మహిళను చంపేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే.. ఇది రాబందుల తెలంగాణగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు, పోలెబోయిన విజయలక్ష్మి, శంకర్ నాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.