Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తనాలతో 10 కోట్ల నష్టం
- 200 ఎకరాల్లో కాత, పూత రాలే..
- ఏపుగా పెరిగినా నిష్ప్రయోజనం
- పుట్టెడు బాధతో చేనును పీకేస్తున్న రైతన్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తి చేను ఏపుగా పెరిగింది. పచ్చగా పరుచుకున్నది. మొక్కలు భారీగా పెరిగాయి. పంట బాగానే వస్తుందన్న భరోసాతో రైతు ఉన్నారు. మేలో విత్తనం నాటితే...అక్టోబర్ నెల సగమైనా...ఆ చేను కాయలే. పూత పూయలే. దీంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. చేనును చూసి మురవడమే తప్ప పూత మాత్రం కనిపించడం లేదు. ఇక పత్తి పండదనే ఆందోళనలోరైతు దిగాలు పడుతున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోయామని భావిస్తున్నాడు. ఈ ఏడాది పంట నష్ట్టపోయినట్టేనని ఆవేదన చెందుతున్నాడు. పంట ఏపుగా పెరిగినా నిష్ప్రయోజనమన్న ఆందోళనతో రైతు చేనును పీకేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంపూర్, కల్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో నకిలీ విత్తనాల మోసం బయటపడింది. పంట ఏపుగా పెరిగినా ఉపయోగం లేకుండాపోయింది. ముఖ్యంగా కుస్తీ, కల్లూరు, మాడిగం, అంజని తాండ, సాయినగర్ తాండ, అంబగంట్టే, నందనవనం వంటి గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో పత్తి కాయలే. ఎకరాకు రూ 50వేల చొప్పున రూ 10 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయినట్టు రైతు సంఘం అంచనా వేసింది. పంట చేతికొచ్చే దశలో పూత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు. ఇప్పటికే గుండ్యాల శేట్టిబా చేనును పీకేస్తున్నారు. ఐదెకరాలు పట్టాపొలం..మరో 18 ఎకరాలు కౌలు తీసుకుని మొత్తం 23 ఎకరాల్లో పత్తి వేసినా పూత లేదు. దీంతోపాటు కల్లూరు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విత్తనాలు అమ్మిన వ్యాపా రి వద్దకు వెళ్లి రైతులు నిలదీయగా,...మీరు సాగు సక్రమంగా చేయలేదు. అధికంగా మందులు ఉపయోగించటంతో చేను బాగా పెరిగి పూత రావడం లేదంటూ బుకాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బాధ్యత విత్తనాలది కాదు. మీ నిర్లక్ష్యం వల్లే కాత, పూత రాలేదంటూ ఎదురుతిరుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ధ ఆందోళన చేపట్టారు.
అప్పులతో తిప్పలే...
ఆరుగాలం కష్టపడి పత్తి సాగు చేస్తే... పూత, కాయ రాకపో వటంతో రైతు లబోదిబోమంటున్నారు. దుక్కి దున్నడానికి, విత్తనా లు, ఎరువులు, పురుగుమందులు ఇలా అనేక ఖర్చులతో ఎకరాకు రూ 12వేల నుంచి రూ 15వేల వరకు ఖర్చు అయినట్టు చెబుతు న్నారు. సాధారణంగా ఎకరాకు రూ 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. పంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అప్పులతో తమకు తిప్పలు తప్పదని అంటున్నారు. బీటీ విత్తనా లను రైతులకు అంటగట్టి తమను మోసం చేశారని కన్నీళ్లపర్యం తమవుతున్నారు. ఒక ప్యాకెట్ ధర రూ 730. ఎకరాకు ఒకటిన్న ప్యాకెట్ విత్తనాలు సరిపోతాయి. బీటీ విత్తనం పేరుతో నకిలీ విత్తనాలు అమ్మారు. సాధారణంగా బీటీ విత్తనమైతే గులాబీ తెగులు, బుడిద తెగులు సోకదు. కానీ చేనుకు ఈ తెగుళ్లు తగిలాయి. దీంతో పురుగు మందులు కొట్టాల్సి వచ్చింది.
పత్తి సాగు అధికం
రాష్ట్రంలో ఈసారి పత్తి సాగు బాగా అయింది. ప్రభుత్వం ప్రోత్సహించడంతో రైతులు ఆ పంట వైపు మొగ్గుచూపారు. సాధారణంగా ప్రతియేటా 43 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 60. 36 లక్షల ఎకరాల్లో సాగైంది. 54.81 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వ అంచనా వేసింది. కానీ అధిక వర్షాలకు పత్తి దెబ్బతిన్నది. పూత రాలిపోయింది. కాయ పగిలి పత్తి పాడైపోయింది. ఒకవైపు అధిక వర్షాలు నష్టపరిస్తే, మరోవైపు నకిలీ విత్తనాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. దీంతో రైతు పరిస్థితి దీనంగా తయారైంది.
న్యాయం చేయాలి..
పత్తి చేను పెరిగినా కాత, పూతలేదు. మాకు న్యాయం చేయాలి. సర్కారోళ్లు ఆదుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మిన వారిని శిక్షించాలి. తమకు పరిహారం చెల్లించాలి
- గుండ్యాల శేట్టిబా (పత్తిరైతు)
ఎకరాలకు రూ 50వేలు పరిహారం ఇవ్వాలి
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరాకు రూ 50వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం
-బుక్యా విలాస్, జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం