Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం కొట్టుకుపోతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టదా?అని ప్రశ్నించింది. తక్షణమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల పంటలన్నీ మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వేలాది ఇండ్లు నేలకూలడంతో అనేక కుటుంబాల వారు నిరా శ్రయులయ్యారని తెలిపారు. తీవ్ర ప్రాణనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వరద నీటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారని వివరించారు. మంచినీరు, ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక ప్యాకేజీనిచ్చి రైతులు, ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చేతికొచ్చే సమయంలో వరి, పత్తి వంటి పంటలు పూర్తిగా నీటమునిగాయని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారని పేర్కొన్నారు. 1908 తర్వాత హైదరాబాద్లో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని తెలిపారు. చెరువులు, కుంటలకు గండ్లు పడడంతో ఇండ్లు, ఆస్తి, ప్రాణ నష్టం పెద్దఎత్తున జరిగిందని వివరించారు. ఇప్పటి వరకు 70 మంది చనిపోయినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని గుర్తు చేశారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రకృతి ఇంత బీభత్సాన్ని సృష్టించినా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఓదార్పు యాత్ర తప్ప, కేంద్రం వైపు నుంచి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తక్షణమే రాష్ట్రానికి ప్రతినిధి బృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేసి కూలిపోయిన ఇండ్ల స్థానంలో కొత్తవి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలనీ, చనిపోయిన కుటుంబానికి కేంద్రం వాటాగా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలనీ సూచించారు. జాతీయ రహదారులను రిపేర్లు చేయించాలనీ, రైతులకు పంట నష్టపరిహారంతోపాటు తడిసిన ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు కావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు.