Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనలు రూపొందించండి : సీఎం కేసీఆర్
- క్యాబినెట్లో చర్చించి.. ఆమోదిస్తామని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుతం అనుసరిస్తున్న డీఏ విధానాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 'డీఏ ఎంతుండాలనే విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటున్నది. దాన్నే రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం అంచనాలను రూపొందించి, నిర్ణయం తీసుకునే క్రమంలో జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రెండింటికి సంబంధించి కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అక్కడ జరిగే జాప్యం వల్ల రాష్ట్రాలు కూడా డీఏ చెల్లింపులో ఆలస్యం చేయాల్సి వస్తున్నది. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగులకు సకాలంలో డీఏ అందటం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ ఆర్నెల్లకోసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏను నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వ అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డీఏను ప్రకటించి అమలు చేయాలనుకున్నప్పుడు... కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతాన్ని చెల్లించాలి. ఒకవేళ కేంద్రం 2.5 శాతంగా నిర్ణయిస్తే రాష్ట్రం 0.5 శాతం మేర తగ్గించి చెల్లించాలి. ఈ విషయంపై అధికారులు వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలి. అందుకనుగుణంగా క్యాబినెట్లో చర్చించి విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తాం...' అని సీఎం వెల్లడించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, పరిష్కరిస్తామని శుక్రవారం ఆయన ప్రకటించారు.