Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 34 కోట్ల నిధులపై వచ్చిన వడ్డీతో కరోనా బారినపడ్డ జర్నలిస్టులను ఆదుకున్నామని చెప్పారు. దాదాపు 1603 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారికి రూ. 3.12 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కరోనా విజంభించిన నేపథ్యంలో డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ బారిన పడ్డారని చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న జర్నలిస్టులకు వార్తా సేకరణలో భాగంగా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకిందనీ, వీరిని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. మీడియా అకాడమి ద్వారా కరోనా పాజిటీవ్ వచ్చిన 1517 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున, 3 కోట్ల 3 లక్షల 40 వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హౌంక్వారంటైన్లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించామన్నారు. అకాడమి చరిత్రలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడమనేది ఒక మైలు రాయి అని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటీవ్ వచ్చిన ధవీకరణ పత్రం బ్యాంకు వివరాలను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపిన వెంటనే స్పందించి ఆయా జర్నలిస్టుల ఖాతాలో డబ్బులు జమ చేశామని ఆయన వివరించారు. విలేకర్లతో మీడియా అకాడమీ కార్యదర్శి డిఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.