Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు..
- కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు :మంత్రి హరీశ్
నవతెలంగాణ-మిరుదొడ్డి / తొగుట / రాయపోల్
దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికారపార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, తొగుట మండలాల్లో మంత్రి హరీశ్రావు ప్రచారం నిర్వహించారు. మిరుదొడ్డి, తొగుటలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు... కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని బీజేపీ నేతలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
మరి తెలంగాణలో ఎలా పంపిణీ చేస్తామని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివద్ధిలో తాను భాగస్వామినై సిద్ధిపేట తరహాలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోలిపేట రామలింగారెడ్డి ఆశయసాధనకు సుజాతను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీటీసీ, గ్రామాల సర్పంచ్లు ఉన్నారు. అనాజిపూర్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధికి మారుపేరు
కాంగ్రెస్ పార్టీ : అభ్యర్థి భార్య అర్పిత
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటువేసి గెలుపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సతీమణి అర్పితా అన్నారు. తొగుట మండల కేంద్రంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధిలో దుబ్బాక వెనుకబడిపోయింది : మాజీ మంత్రి బాబుమోహన్
దుబ్బాక పట్టణంలో చేపట్టిన బీజేపీ ప్రచార కార్యక్రమానికి మాజీ మంత్రి బాబుమోహన్ హాజరై మాట్లాడారు. బస్టాండ్ను చూస్తే అభివృద్ధిలో దుబ్బాక ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుందని అన్నారు. సిద్దిపేట, దుబ్బాక తనకు రెండు కండ్లని హరీశ్రావు చెబుతున్నాడని.. అలాగయితే సిద్దిపేట మాదిరిగా దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. అభ్యర్థి రఘునందన్రావు మాట్లాడుతూ.. అభివృద్ధి పథకాల్లో సగానికి సగం నిధులు కేంద్రమే ఇస్తున్నదన్నారు.