Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నరకం వడ్లు పండక ఒకరు.. తెగుళ్లతో మరొకరు
- ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు
నవతెలంగాణ-తంగళ్ళపల్లి/దోమకొండ
రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినట్టు సన్నరకం వడ్లు సాగుచేసినా.. గింజలు రాకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన రెండు ఎకరాల పంటకు ఓ రైతు నిప్పుపెట్టాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ సారి వానాకాలంలో తెలంగాణ సోనా రకం పంటనే వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో తన రెండెకరాల్లో సన్నరకం వడ్లు చల్లాడు. తెగుళ్లు రావడంతో దాదాపు రూ. 85 వేలు అప్పు చేసి ఆరు సార్లు వివిధ రకాల పురుగు మందులను పిచికారి చేశాడు. పంటకు రోగం తగలడం, పురుగు పట్టడం వంటివి జరుగుతుండడంతో వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పినా.. పట్టించుకోలేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి రాక పూర్తిగా నష్టపోయామని వాపోయాడు. గతంలో దొడ్డు రకం వరి పండిస్తే రెండు ఎకరాల్లో దాదాపు రూ. 1.50-2 లక్షల వరకు వచ్చేదనీ, ఇప్పుడు పూర్తిగా నష్టపోయాననీ తన గోడు వెళ్లబోసుకున్నాడు. పంట కోసం చేసిన అప్పులు ఇప్పుడు ఎలా తీర్చేదని వాపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు డబ్బాలు పట్టుకుని గోడు వెళ్లబోసుకున్నాడు. ఇకనైనా అధికారులు ఆదుకోవాలని కోరుతున్నాడు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన మన్నె సాయిరెడ్డి రెండెకరాలలో సన్న వరి పంటను సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా వరకు పంట నేలకొరిగింది. దానికి తోడు దోమపోటు రోగం రావడంతో రెండు మూడు సార్లు పురుగు మందులనూ పిచికారి చేశాడు. అయినా పోకపోడవంతో ఆ రైతుకు ఏమి చేయాలో తెలియలేదు. కనీసం తన పంటకు వచ్చిన దోమపోటు పక్కవారి పంటకు సోకకుండా ఉండేందుకు ఎకరం పంటకు నిప్పంటించాడు. పంట వేయడానికి సుమారు రూ. 35 వేలు ఖర్చయ్యిందనీ, మందులకు మరో రూ. 10 వేలు ఖర్చు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.