Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారీ విధానమే సమస్యలకు కారణం
- ట్రంప్ తో మోడీ మైత్రి దేశానికే నష్టం:లెఫ్ట్ వర్డ్ చీఫ్ ఎడిటర్ విజయ్ ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా పెట్టుబడిదారులు, కార్పొరేట్లకే అనుకూలమని ట్రైకాంటినెంటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ చీఫ్ ఎడిటర్ లెఫ్ట్వర్డ్ విజయ్ ప్రసాద్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్లలో అధ్యక్షుడెవరైనా సామ్రాజ్యవాదానికే ప్రతినిధులనీ, ప్రజలకు అనుకూలం కాదనీ చెప్పారు. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం పట్ల ఆ రెండు పార్టీల మధ్య వైఖరిలో తేడా లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తేనేమిటి ప్రపంచానికి?' అనే అంశంపై వెబినార్ జరిగింది. విజరుప్రసాద్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందన్నారు. భారత్లో మోడీ వచ్చిన రెండేండ్ల తర్వాత అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వాళ్లిద్దరూ పెట్టుబడిదారీ విధానానికి, ద్రవ్యపెట్టుబడికి అనుకూలం తప్ప ప్రజలకు కాదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ విధానమే ప్రధాన కారణమని చెప్పారు. పారిశ్రామికరంగంలో వస్తు ఉత్పత్తిరంగంలో లాభాలు పడిపోతున్నాయని అన్నారు. ద్రవ్యపెట్టుబడిలో లాభాలు మాత్రం పెరుగుతున్నాయని వివరించారు. ద్రవ్యపెట్టుబడి శక్తులు తమ లాభాలు కాపాడుకునేందుకు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టి ఆ సొమ్మును పన్ను తక్కువగా ఉన్న దేశాలకు తరలిస్తున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వాలు బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి నయా ఉదారవాద పంథాను అనుసరిస్తున్నాయని అన్నారు. భారత్లాంటి దేశాలు సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాల్లో భాగంగా జాతీయ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు పాలకులు అప్పగించడం నయాఉదారవాద విధానాల్లో భాగమేననన్నారు. సంక్షేమ పథకాలకు తక్కువ బడ్జెట్ కేటాయించటం, కార్మిక చట్టాలను సవరించటం, పనిగంటలను పెంచటం వంటి నిర్ణయాలు చేస్తున్నారని చెప్పారు. వివిధ దేశాల్లో ఉదారవాద శక్తులు బలహీనపడిన చోట తీవ్రవాద, మితవాద శక్తులు పాలకవర్గ ప్రతినిధులుగా ముందుకు వస్తున్న పరిణామాన్ని ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో ఒబామా, ఇంగ్లాండ్లో టోనిబ్లెయిర్, భారత్ పీవీ నుంచి ఇప్పటి వరకు పాలకులంతా సరళీకరణ విధానాలనే ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు పాలకులు విధానాలు రూపొందిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో ఎదుర్కొంటున్న సమస్యలకు చైనా, వలసవాదులు, మైనార్టీలు అంటూ ట్రంప్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని గుర్తు చేశారు. ట్రంప్ చెప్పిన సమస్యల పట్ల డెమోక్రటిక్ పార్టీకి భిన్నాభిప్రాయం లేదని చెప్పారు. అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదనీ, గణతంత్ర రాజ్యమనీ అన్నారు. గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్కు ఎక్కువ ఓట్లు వచ్చినా ట్రంప్ గెలిచారని గుర్తు చేశారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారని వివరించారు. భారత్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్నట్టుగానే అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు ఎక్కువ వచ్చిన వారే అధ్యక్షుడు అవుతారని అన్నారు. మెజార్టీ ప్రజలు కోరుకుంటే అమెరికా అధ్యక్షుడు కాలేరని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే ట్రంప్ ఓడిపోతాడు కానీ అది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఆయన గెలిచేందుకు దేనికైనా తెగించే అవకాశమున్నదని అన్నారు. చైనాను అడ్డుకునేందుకు రష్యాతో ట్రంప్ చేతులు కలుపుతున్నారని చెప్పారు. కానీ ట్రంప్ విదేశాంగ విధానంతో అమెరికా పాలకమండలికి విభేదాలున్నాయని ఉదాహరణలతో వివరించారు. పెట్టుబడిదారీ విధానం నిరంతరం సంక్షోభానికి లోనుకావడానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా తన అగ్రరాజ్య స్థానాన్ని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. చైనా ఆర్థికాభివృద్ధిలో, టెక్నాలజీలో ముందుకుకెళ్తున్నదని వివరించారు. అమెరికాలో ఎవరు గెలిచినా చైనా అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యమని చెప్పారు. చైనా వ్యతిరేక భావజాలాన్ని పెంచేందుకు ఆస్ట్రేలియా, జపాన్, భారత్తో కలిసి అమెరికా ఓ కూటమిని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కూటమిలో భారత్ భాగస్వామి కావడం వల్ల ఈ దేశానికి తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. అలీన దేశంగా ఉన్న భారత్ అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారడంతో స్వతంత్ర విదేశాంగ విధానానికి తీవ్ర నష్టమని అన్నారు. చైనాకు కళ్లెం వేయాలని అటు ట్రంప్, ఇటు బైడెన్ భావిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై లోతైన చర్చ జరగాలన్నారు. అమెరికాతో భారత్ ఉండడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరిం చిన ఈ కార్యక్రమంలో విజరుప్రసాద్ ప్రసంగాన్ని కొండూరి వీరయ్య తెలుగులో అనువాదం చేశారు.