Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ,
న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కృష్ణయ్య
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి ఏకైక మార్గం కమ్యూనిజమేననీ, పాలకవర్గాల భ్రమలకు లోనుకాకుండా ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే నాయకులకు ఓటేయాలని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి అన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గెలుపు కోసం శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగం, అధిక ధరలు, కరోనా, ఆర్థిక సంక్షోభం లాంటి వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలు పరిష్కారం చేయగల నాయకుడు స్వతంత్ర అభ్యర్థి కె.నాగేశ్వర్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని కోరారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందనే ప్రచారాన్ని పాలకవర్గాలు ముమ్మరంగా చేస్తున్నాయనీ, కానీ వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో కోవిడ్ నియంత్రణకు విజయవంతంగా పనిచేయడం ఈ సందర్భంగా గుర్తుచేశారు. కోవిడ్ పుట్టిన చైనా దేశంలో ప్రజా రంగాలన్ని పని చేస్తుంటే.. మన దేశంలో ఇంకా కరోనా కట్టడిలో బీజేపీ పరిపాలన పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్రం హిందూ ఎజెండాను నెత్తిన ఎత్తుకొని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, తలాక్ బిల్లు, రామజన్మభూమి, పౌరసత్వ బిల్లు, వంటి వాటిని ముందుకు తెచ్చి దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయానం, బొగ్గు, ఎల్ఐసీ, బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ వారికి అప్పనంగా అమ్ముతున్నారని మండిపడ్డారు. 12 ఏండ్లు ఎమ్మెల్సీగా పని చేసి అనేక సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తిన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఏనాడు తాయిలాలకు లొంగలేదని గుర్తుచేశారు. నవంబర్ 6 వరకు పట్టభద్రుల ఓట్ల నమోదుకు అవకాశం ఉందనీ, పట్టభద్రులైన మేధావులు ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకునేలా కషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లె గోపాల్, ఆర్.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, వర్ధన్ పర్వతాలు, వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ, సోషల్ మీడియా ఇంచార్జి జగదీష్ పాల్గొన్నారు.