Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిపాలైన 20 లక్షల ఎకరాలు
- అకాల వర్షాలతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ
- రూ. 20 వేల కోట్ల నష్టం జరిగింది.. రైతు సంఘాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాలవర్షాలకు పంటలు దెబ్బతిని వేలకోట్లల్లో నష్టం సంభవించింది. పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతను వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. వర్షాలు సకాలంలో పడ్డాయని సంబరపడిన రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. వరుసగా కురిసిన వానలతో అన్ని పంటలూ దెబ్బతిన్నాయి. నీటిలో మురిగిపోతున్నాయి. ఇక కోలుకునెదెన్నడు? కష్టాల నుంచి బయటపడేదెన్నడు? అంటూ అన్నదాత కన్నీంటి పర్యంతమవుతున్నాడు. ఏపుగా పెరిగిన చేను వరదల్లో మునిగిపోవడంతో గుండెలు బాదుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. చేసిన కష్టం నీటిపాలు కావడంతో ఆవేదన చెందుతున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు 20 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు రూ 20వేల కోట్ల విలువైన పంటనీటిపాలైందని రైతు సంఘాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిసింది.
మునిగాయి...మురిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు, పండ్ల తోటలు చేతికందకుండాపోయాయి. నియంత్రి త సాగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వరి, పత్తి, కంది పంటలకు భరోసా ఇచ్చింది. ఆ భరోసాతోనే రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపారు. వరి సన్నరకాల సాగు బాగానే జరిగింది. పొట్టదశలోనే వరదలు ముంచెత్తడంతో నీరు చేరి మురిగిపోతు న్నాయి. ఈదురుగాలలకు వరిచేను కిందపడి పోయింది. మరికొన్ని చోట్ల వడ్లు రాలిపోయాయి. పత్తి ఏరే దశలోనే వానలు రావడంతో పూర్తిగా దెబ్బతింది. పగిలిన పత్తికాయలో నీరు చేరి మొలకెత్తుతున్నాయి. తడి ఆరకపోవడంతో చేను ఎర్రబారుతున్నది. తిరిగి కాయ, పూత, వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. దీంతో దిగుబడి తగ్గి పోయి రైతు బాగా నష్టపోయే ప్రమాదం ముంచు కొచ్చింది. సోయాబీన్ గింజ మొలకెత్తుతున్నది. పెసరతీగ నీటిలో మునిగి, మురిగిపోయింది. పప్పు ధాన్యాల పంటల దిగుబడి తగ్గిపోయింది. గింజ ఎదగలేదు. కూరగాయల పంటలు దెబ్బతిని మార్కెట్కు వచ్చే పరిస్థితి లేదు. ఈ సమయానికి కొత్త కూరగాయలు మార్కెట్కు చేరుకుంటే ధరలు తగ్గి వినియోగదారులకు ఊరట కలిగే అవకాశం ఉండేది. కానీ ఆపరిస్థితి లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బహుళ పంటల సాగుకు సర్కారు పాతర
రాష్ట్రంలో బహుళ పంటలకు అనువైన నేలలు ఉన్నాయి. అన్ని రకాల పంటల సాగు చేసుకుంటున్నారు. మార్కెట్తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితుల ఆధారంగా రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. నియంత్రిత సాగుతో రాష్ట్ర ప్రభుత్వం దానిని బ్రేక్ చేసింది. నాలుగైదు పంటలపై ఫోకస్ చేయడంతో అవి వరదలకు నాశనమయ్యాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గిపోయి, పెట్టుబడి రాక రైతు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. పొలాలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారు. వరి 50 లక్షల ఎకరాలు, పత్తి 60.34 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 7 లక్షల ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 2 లక్షల ఎకరాల్లో సాగైంది. మక్కలు వేయమని చెప్పలేదు కాబట్టి కొనేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసింది. రైతుల ఒత్తిడి పెరగడంతో ఒక మెట్టు దిగిందనే చెప్పవచ్చు.
ప్రభుత్వమే కొంటుందా?
వరి, పత్తి, కంది, సోయాబీన్ వంటలను తామే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలతో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. మిగిలిన పంటలు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి చర్యలూ చేపట్టలేదు. పత్తి సేకరణ కోసం సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు రంగంలోకి దిగారు. తేమ, తడి పేరుతో అడ్డికి పావుసేరు లెక్కన అడుగుతున్నారు. 8శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా... మద్దతు ధర ఇవ్వకుండా రూ 2500 నుంచి రూ 3500 కొంటున్నారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఎంతకో అంతకు అమ్ముకోంటున్నారు.
పరిహారం అందేనా?
ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఏ విధంగా ఇవ్వాలనే ప్రణాళిక సర్కారు వద్ద లేదనే చెప్పాలి.ఈఏడాది పంటల బీమా ప్రీమి యం చెల్లింపును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తేశాయి. దీంతో పంటల బీమా అమలయ్యే పరిస్థితి లేదు. దీంతో రైతు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. వరద బీభత్సంతో దెబ్బతిన్న పంటలకు తక్షణ సాయంగా రెండువేల కోట్లు ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.
తక్షణ సాయం కింద రూ 2వేల కోట్లు ఇవ్వాలి: టి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
దెబ్బతిన్న పంటలకు తక్షణ సాయం కింద రూ 2వేల కోట్లు ఇవ్వాలి. వరదలకు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. వాస్తవ పంటనష్టం అంచనా ఆధారంగా రైతులకు పరిహారం చెల్లించాలి. ఎకరానికి రూ 25వేల పరిహారం, రుణమాఫీ చేయాలి. తడిసిన, తేమ ఉన్న పత్తి, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పత్తి పాడైన నేపథ్యంలో కూలీలకు ఉపాధి పథకంలో 200 పనిదినాలు కల్పించాలి. పట్టణాలు, గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం, రూ 7500 ఇవ్వాలి.