Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు సీఎం ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు దసరా పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్
అధికారుల్ని ఆదేశించారు. రోజుకు కనీసం లక్షమందికి ఆర్థిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై శుక్రవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కమిషనర్ సత్యానారాయణ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వాటర్బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎమ్డీ జి రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ''భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలి'' అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా నగరంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థపై సీఎమ్డీ జి రఘుమారెడ్డి సీఎం కేసీఆర్కు వివరించారు. ''భారీ వర్షాలు, వరదల వల్ల 15 చోట్ల 33/11 కెవి సబ్ స్టేషన్లు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేసి, పునరుద్ధరించాం. 1,080 చోట్ల 11 కేవీ ఫీడర్లలో దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1215 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా, 1,207 ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసి, పునరుద్ధరించారు. మిగతా 8 ట్రాన్స్ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేకపోయాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మతు చేశారు. మరో 759 మిగిలి ఉన్నవి. వీటిలో 586 ట్రాన్స్ ఫార్మర్లు నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లో మూసీ నదిలో మునిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,299 స్థంభాలు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేశాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్థంభాలు దెబ్బతినగా, 3,249 మరమ్మతు చేశారు. మిగతా 2,086 స్థంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి'' అని రఘుమారెడ్డి వివరించారు.