Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా టీకా కోవాగ్జిన్ పై మూడో దశ క్లినికల్ ట్రయళ్లకు నగరంలోని నిమ్స్ సిద్ధపడుతున్నది. ఇప్పటికే రెండో దశలో 55 మందికి టీకా ఇవ్వగా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. యాంటీబాడీస్ కూడా అభివద్ధి చెందాయన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలేత్తలేదనీ, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. మూడోదశ ట్రయళ్లల్లో భాగంగా మరో 200 మందికి టీకా ఇవ్వనున్నట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో ఈ దశ ప్రారంభం కానున్నది.
అనుమతిస్తే డిసెంబర్ లో కోవాగ్జిన్ ?
అత్యవసరమైతే, ప్రభుత్వం అనుమతిస్తే డిసెంబర్ లోనే కోవాగ్జిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని క్లినికల్ ట్రయళ్ల భాగస్వామి భారత్ బయోటెక్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా సరాసరిగా ప్రతి రోజూ 50 వేల వరకు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు శీతాకాలంలో వైరస్ విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాను సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని భారత్ బయోటెక్తోపాటు మరో రెండు సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ మూడింటి ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థకు కోవాగ్జిన్, పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజిన్కా సంయుక్తంగా అభివద్ధి చేస్తున్న కొవిషీల్డ్, రష్యా టీకా స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయళ్లు కొనసాగుతున్న విషయం విదితమే.