Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 బ్రాంచ్లకు ఫుల్ డిమాండ్
- మూడు ఇంజినీరింగ్ కాలేజీల్లో సున్నా ప్రవేశాలు
- ఇంజినీరింగ్లో 50,137 మంది, ఫార్మసీలో 181 మందికి సీట్లు
- తొలివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 48 ఇంజినీరింగ్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 13 విశ్వవిద్యాలయ కాలేజీలు, 35 ప్రయివేటు కాలేజీలున్నాయి. మూడు కాలేజీల్లో మాత్రం ఒక్కరికీ సీటు కేటాయించకపోవడం గమనార్హం. ఆ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచలేదని తెలుస్తున్నది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా తొలివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ శనివారం కేటాయించింది. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో 178 కాలేజీల్లో 70,135 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 50,137 (71.49 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 19,998 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఫార్మసీ కోర్సుల్లో 119 కాలేజీల్లో 4,505 సీట్లున్నాయని తెలిపారు. 181 (4.02 శాతం) మందికి మాత్రమే సీట్లు కేటాయించామని వివరించారు. 4,324 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేసినా 4,603 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. క్రీడా కోటా సీట్లను తుదివిడత కౌన్సెలింగ్లో కేటాయిస్తామని వివరించారు. అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈనెల 28లోగా https://tseamcet.nic.in వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ద్వారా వివరాలు నమోదు చేయకపోతే వారి సీట్లు రద్దవుతాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో 45 బ్రాంచ్లున్నాయని వివరించారు. 21 బ్రాంచ్ల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు.
ఈ బ్రాంచ్ల్లో ఎక్కువ సీట్లు మిగలడమే ఇందుకు కారణం. ఇతర వివరాలకు వెబ్సైట్ను చూడాలని కోరారు.