Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ సామాన్యుడి వేడుకోలు
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
మళ్లీ దసరా వచ్చింది. మా ముఖాల్లోనే ఎలాంటి సరదా లేదు. సొంతూరు కెళ్దామంటే ఆర్టీసీ బస్సుల్లేవు. ప్రయివేటు దోపిడీని భరించే ఆర్థిక స్తోమత లేదు. కరోనా పేరుతో మమ్మల్ని సామాజికంగా, భౌతికంగా పాలకులు దూరం చేసేశారు. పండుగనాడు తిండి లేదు. పోటెత్తిన వరదలు బతుకుల్ని వీధిన పడేశాయి. తప్పును నీ (ప్రకృతి) పైకి నెట్టేసి, పరిహారం పేరుతో మా బతుకుల్ని పరిహాసం చేస్తుంటే...బతికేందుకు అంతకుమించిన మార్గం కనిపించట్లేదు. మా తాతల నాటి 'నీ బాంచన్ దొరా' బతుకులే కండ్ల ముందు కనిపిస్తున్నాయి. నవరాత్రుళ్లలో నీ అవతారాలన్నింటికీ చేతులెత్తి మొక్కడానికే పరిమితమయ్యాం. తొలిరోజు నీవు బాలాత్రిపుర సుందరిగా కనిపించావు...అదేం ఖర్మో మా పదేండ్ల దీక్షిత్రెడ్డిని కిడ్నాప్ చేసి పెట్రోల్పోసి చంపేశారు. మహిషాసురమర్థినివై 'అసురులపై' శూలం విసురుతావనుకుంటే, లలితాదేవివై సౌమ్యంగానే ఉండిపోయావేమ్మా! పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ) అంటూ పాలకులు మమ్మల్ని కులమతాల పేరుతో విభజిస్తుంటే కాత్యాయనీదేవిగా కామ్గా ఉండటం ఏమీ బాగాలేదు! అకాల వర్షాలతో అన్నంపెట్టే రైతన్న ఆర్తిగా కేకలు పెడుతుంటే అన్నపూర్ణవైన నీకు వినిపించట్లేదా...! కేజీ టు పీజీ ఉచిత విద్య అమలెక్కడుందో మహాసరస్వతివైన నీకే ఎరుక! దళితుల ఆత్మగౌరవం, మూడెకరాల భూమి, రెండు పడకల ఇండ్లు గాయత్రీ దేవివైన నీవే వెతికి పెట్టాలి! కురుమలకు గొర్రెలు, యాదవులకు బర్రెలు, మత్స్యకారులకు చేపలు ఏడిచ్చారో... ఎందరికిచ్చారో... అవెక్కడున్నాయో...కోడె మొక్కులు తీసుకునే రాజరాజేశ్వరీదేవిగా నీకే ఎరుక! చూడమ్మా...నవరాత్రుళ్లలో నీకు రోజుకో నైవేద్యం పెట్టాలని మాకూ ఉంది. కానీ ఏం చేస్తాం... కరివేపాకు, కొత్తిమీర మొదలు ఉప్పు, పప్పు సహా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆదిలాబాద్ అడవుల్లో పోలీసుల తూటాలు, అన్నల ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. మా గిరిజన 'బతుకమ్మ'కు మళ్లీ కష్టాలొచ్చి పడ్డాయి. పోడు భూముల్లేవు...అటవీ ఉత్పత్తులూ లేవు...అన్నీ సర్కారోళ్లవేనంట... అదేంటమ్మా నువ్వు పులి పైనే స్వారీ చేశావు కదా! మరి మమ్మల్నెం దుకు అడవుల్లోకి రావద్దంటున్నారు? ఆర్టీసీలో యూనియన్లు లేవంటారు...టీఎన్జీవో సంఘాల నుంచి ఒకరోజు వేతనం విరాళం గా తీసుకుంటారు...ఆళ్లు ఈ ళ్లు ఉద్యోగులే కదా! ఏంటో మా సర్కారోళ్ల రాజకీయం మాకర్థమై చావట్లేదు! మేము 'ఎంగిలిపువ్వు బతుకమ్మ' దగ్గరే ఆగిపోయాం తల్లీ...రుధిరార్ణవ పతాక అండతో మా పాలకుల దుష్ట విధానాలపై 'నవదుర్గల' చైతన్యాన్ని వెల్లివిరి సేలా చేస్తాం. ప్రశ్నిస్తే... పోలీసు కేసులు, అరెస్టులు, కోర్టులు అంటూ మమ్మల్ని నానా యాతన పెడుతున్న సర్కారుపై పోరుకు నీ నవరాత్రులే నాంది పలకాలి. సంబురంగా సద్దుల బతుకమ్మ జరుపుకోవాలి. వచ్చే దసరా ప్రగతిశీల సమరోత్సాహానికి ప్రతీకగా, అట్టడుగు జాతి ఆత్మగౌరవ చిహ్నంగా మారాలి.