Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దౌల్తాబాద్/ చేగుంట
సమయం దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో రాజకీయ వేడీ రాజుకుంటుంది. అధికార, విపక్షాల ఆరోపణలతో ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పోచంపల్లి, ఇంద్ర ప్రియాల్ హైమత్ నగర్ గ్రామాల్లో శనివారం మంత్రి హరీశ్రావు పర్యటించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. 'పుకార్ల పుట్ట అబద్దాల గుట్ట' అంటూ బీజేపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులను కూడా ఇవ్వలేదని విమర్శించారు. రూ. 57కోట్లతో గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ మీదుగా రామాయంపేట్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రోడ్డు పడిందన్నారు. దౌల్తాబాద్ మండలంలో 133/11 కెేవీ సబ్ స్టేషన్తో పాటు మూడు 33/11 సబ్ స్టేషన్లు నిర్మించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధిస్తుందన్నారు. గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తావులేదనీ, వారి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. అలాగే పలు గ్రామాల్లో ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
దుబ్బాక అభివృద్ధిలో అధమం : కాంగ్రెస్ నాయకులు
నార్సింగ్ మండలంలో అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రచారం నిర్వహించారు. దౌల్తాపూర్ మండలంలో అద్దంకి దయాకర్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివద్ధిలో అధమ స్థానంలో ఉందన్నారు. గతంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని తెలిపారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో ఎంతోమంది విద్యార్థులు మరణించారని, కొండగట్టు బస్సు ప్రమాదంలో అనేక మంది మరణించార న్నారు. హైదరాబాద్లో వరద ప్రమాదం వల్ల అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ సుమారు 100 మంది వరకు మరణించారని, ఇంత జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలిచినట్టే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన తండ్రిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తామని నర్సాపూర్ బహిరంగ సభలో మాట ఇచ్చిన కేసీఆర్ మాట తప్పడంతోనే తన తండ్రి గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇచ్చేవరకు రైతుల పక్షాన పోరాడుతానన్నారు.