Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-కంఠేశ్వర్
కష్టజీవులకు అండగా కమ్యూనిస్టులు మాత్రమే ఉన్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంపై సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు అధ్యక్షతన ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పాలకవర్గం మత, కుల, ప్రాంతీయతత్వాలతో ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నాయన్నారు. పాలకులు కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలను కొనసాగించటం వల్ల ప్రజాసమస్యలు పక్కకుపోయి ప్రజల మనోభావాలతో కాలం వెళ్లదీస్తున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేండ్లు అయినప్పటికీ ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా దేశంలో అనేక ఉద్యమాలను నిర్వహిస్తూ, అడ్డంకులను తట్టుకొని దేశంలో మూడు రాష్ట్రాల్లో ప్రజలకు సేవలందించినట్టు తెలిపారు. అనేక భూ పోరాటాలు, విముక్తి పోరాటాలు నిర్వహించి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. ఫలితంగా ఇప్పటికైనా ప్రజలకు కొన్ని ఉపయోగాలు జరుగుతున్నాయనీ, కమ్యూనిస్టులే లేకపోతే దోపిడీ వర్గాల ఆగడాలు మరింత పెరిగేవని అన్నారు. ప్రపంచంలో ప్రజల విముక్తికి కమ్యూనిస్టులు మాత్రమే కారకులు అయ్యారని, దేశంలో కూడా కమ్యూనిజం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేసి ప్రజా ఉద్యమాలను నిర్వహించటం వల్లనే నేటికీ కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో ఆదరణ, అభిమానాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పటికైనా ప్రజలు బూర్జువా పార్టీల విధానాలను వ్యతిరేకిస్తారని అంతవరకు ప్రజల్ని చైతన్య పరుస్తూ, ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహించాలని సూచించారు.