Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేతలు జూలకంటి, బి వెంకట్, డిజి డిమాండ్
- 20 లక్షల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల వరకు పంటనష్టం
- హైదరాబాద్లో శాశ్వత ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి
- కేంద్ర బృందం కలవకుండా వెళ్లడం అప్రజాస్వామికం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన ప్రజలు, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డిజి నరసింహారావు, బి వెంకట్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రూ.2 వేల కోట్లు వరద సహాయం ప్రకటించాలని కోరారు. శనివారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వర్షాలు, వరదల తీవ్రతను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం ఎవరినీ కలవకుండా వెళ్లటం అప్రజాస్వామికమని అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలను కలవని ఆ బృందం రాష్ట్రంలో ఎందుకు పర్యటించిందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేయడం దురదృష్టకరమని విమర్శించారు. వర్షాలు, వరదలకు సంబంధించిన నష్టాన్ని వివరిస్తూ తమ పార్టీ రూపొందించిన వినతిపత్రాన్ని ఈ మెయిల్ ద్వారా పంపామని వివరించారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. వరి, పత్తితోపాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టం వల్ల రూ.15 వేల కోట్లు, ఇండ్లు కూలిపోవడం, రోడ్లు, చెరువులు, కుంటలు ధ్వంసం కావడం, విద్యుత్ స్తంభాలు తెగిపోవడం వల్ల రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని వివరించారు. 80 మంది వరకు చనిపోయారని అన్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రమంతా అతలాకుతలం అయ్యిందన్నారు. పంట నష్టపోయిన వారికి ఎకరాకు వరికి రూ.15 వేలు, వాణిజ్య పంటలకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. చనిపోయిన ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పాక్షికంగా దెబ్బతింటే రూ.5 లక్షలు, చేతివృత్తులు, ఇతరులు నష్టపోతే వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. హైదరాబాద్లో 24 గంటలపాటు కురిసిన వర్షంతో నగరంలోని రోడ్లన్నీ నదుల్లా ప్రవహించాయని అన్నారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిండిపోయాయని చెప్పారు. హైదరాబాద్లోని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. రూ.50 వేల కోట్లు కేటాయించి ఐదు విడతల్లో ఖర్చు చేయాలని సూచించారు.
మొక్కజొన్నను ప్రభుత్వమే కొనాలి
మొక్కజొన్న రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ ఖండించారు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశాల్లేవని ప్రకటించడం సరైంది కాదన్నారు. ఆ పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి మక్కలను దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణమని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని చెప్పారు. పత్తి, వరి ఎంత నష్టం జరిగితే అంత పరిహారం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. కనీసం వంద రోజులు ఉపాధి హామీ చట్టం కింద పని కల్పించాలని సూచించారు.