Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలపై కేంద్ర బృందం వ్యవహారం
- ఉన్నతాధికారులతోనే భేటి
- సీఎంను కలవని వైనం
- రాజకీయపార్టీలు, ప్రజా, రైతు సంఘాలకు 'నో'
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరద నష్టాలను అంచనా వేయడానికొచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని బృందం వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చామా ..చూశామా..వెళ్లామా అన్నట్టుగా ఉంది ఆ బృందం పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో పర్యటించడం, ఉన్నతాధికారులతో భేటి కావడం వరకే పరిమితమయ్యారు. అక్కడక్కడా దారిలో కలిసిన ఆయా పార్టీల
నేతలు, రైతు సంఘాల నుంచి ఒకటి, రెండు వినతిపత్రాలు తీసుకుని ఢిల్లీ విమానమెక్కారు. నిజానికి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలంటే కచ్చితమైన అధ్యయనం, పరిశీలన అవసరం. స్థానికంగానే వీటిని సేకరించి, ఒక అంచనాకు వచ్చి తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కానీ, అదేమీ కేంద్ర బృందానికి పట్టినట్టు కనిపించలేదు. గత వందేండ్లలో ఎన్నడూలేనివిధంగా హైదరాబాద్తోపాటు జిల్లాల్లో కూడా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన విషయమూ విదితమే. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తొలుత రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందనీ, తక్షణ సాయం కింద రూ. 1375 కోట్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అందుకు కేంద్రం సాయం గురించి ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకుండా బృందాన్ని రెండు రోజుల పర్యటనకు పంపింది. ఆ బృందం కాస్త హైదరాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి దేశ రాజధాని బాటపట్టింది. కాగా ఇక్కడో ట్విస్ట్ ఉంది. శుక్రవారం హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డిని కలిసింది. ఆయన ఈసందర్భంగా రాష్ట్రంలోని వరద పరిస్థితులపై వారితో సమీక్ష చేశారు. సాయం గురించి మాట్లాడకుండా తొందరగా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న విపత్తు సహాయ నిధులను 75 శాతం వరకు వాడుకోవచ్చంటూ ఉచిత సలహా పడేశారు. దీనిపై రాష్ట్రంలోని అధికార పార్టీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలావుండగా సాధారణంగా కేంద్రం నుంచి ఈ తరహా బృందాలు ఎప్పుడొచ్చినా ఉన్నతాది కారులతో భేటి కావడం, సమీక్ష చేయడం, అనంతరం ముఖ్య మంత్రిని కలిసి ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం ఆనవాయితీ. అలాగే రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాల నుంచి వినతిపత్రాలను తీసుకోవడం, వాటిని పరిశీలించడం ,ఆ తర్వాత పూర్తిస్థాయి నివేదికను కేంద్రా నికి పంపడం పద్ధతి. కానీ, ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఉన్నతాధికారులతో సమావేశమై కేంద్ర బృందం సీఎంను కలవకపోవడం పట్ల రాష్ట్రంలోని రాజకీయపక్షాలు, ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశమైంది. అంతేగాక కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలవడంతో ఒకింత రాజకీయ పరిణామాలు వేడెక్కడానికి కారణమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో భేటి అయిన సందర్భంగా వరద నష్టం రూ. 9 వేల కోట్లకుపైగా ఉంటుందని తాత్కాళిక అంచనా బయటకొచ్చింది. పర్యటన చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టం ఇంకా ఎక్కువగానే ఉన్నట్టుగా నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్రం బృందం గానీ వరద నష్టంపై తమ పరిశీలన, అంచనాల గురించి మీడియాకు తెలియజేయలేదు. సాధారణ ఈ తరహా బృందాల పర్యటనలో పరిస్థితులను పరిశీలించిన తరువాత మీడియాకు చెప్పే సాంప్రదాయమూ ఉంది. అయితే వాటిని కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం పట్టించుకున్న ధాఖలాలు లేవు. తమ మానాన తాము విచ్చేసి, అక్కడక్కడ తిరిగి నివేదిక తయారికి పూనుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాజకీయ పక్షాలు, ప్రజా, రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థల నుంచి వినతిపత్రాలు తీసుకుని అధ్యయనం చేస్తే వరదల నేపథ్యంలో చోటుచేసుకున్న వాస్తవ ప్రాణ, ఆస్థి, పంట నష్టాలను పూర్తిస్థాయిలో అంచనావేయడానికి అవకాశం కలిగేదని రాజకీయపార్టీలు అభిప్రాయపడుతున్నారు. ఇవేవి చేయకుండా కేంద్ర బృందం ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదని విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నాయి. వరదలో దాదాపు వంద మందికిపైగా చనిపోయారని సమాచారం.