Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పోరాటాలతోనే పరిష్కారమవుతాయని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, అసోసియేట్ అధ్యక్షులు వై అశోక్కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. పీఆర్సీ అమలు, అంతర్జిల్లా బదిలీలు, పదోన్నతులు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, పారిశుధ్య కార్మికుల నియామకం, గురకులాల్లో ఖాళీల భర్తీ, మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో స్కూల్ గ్రాంట్స్ విడుదల, కేజీబీవీ సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు వంటి సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని వివరించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రస్థాయిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు.