Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి మాట తప్పిన యాజమాన్యం
- సమ్మెకు సై......
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆ ఆస్పత్రికి వారి సేవలే కీలకం. మిగిలిన సిబ్బంది కొద్ది సేపు రోగులతో గడిపితే 24 గంటలు వారి వెన్నంటి ఉండి మనో ధైర్యం ఇస్తుంటారు. రోజూ వచ్చే రోగుల వివరాల నమోదు మొదలు చికిత్స వరకు డాక్టర్లు, ఇతర సిబ్బంది విధులు నిర్వహించే సమయం తక్కువ. కాని నర్సులు మాత్రం నిరంతరాయంగా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తుంటారు. సమయానికి మందులు వేసుకోవడం, ఇతర సూచనలు, సలహాలిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. సిబ్బంది తక్కువ, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా రోగుల వద్ద చెరగని చిరునవ్వుతో ఏమి కాదులే.... అంటూ పదే పదే చెప్పే స్వాంతన ఇచ్చే మాటలే రోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపుతుంటాయి. ఒక్కో సందర్భంలో రోగుల బంధువులు ఆగ్రహానికి గురైన దాడులు చేస్తే తొలి బలయ్యేది వారే. అలాంటి నర్సుల హక్కులు, సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ యాజమాన్యం నిర్దయగా వ్యవహరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
ప్రతిష్టాత్మక నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రెగ్యులర్ నర్సులు మరోసారి సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది నవంబర్లో నర్సులు దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలనీ, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉద్యమబాట పట్టాలనుకున్నప్పటికీ కరోనా అత్యవసర పరిస్థితి నెలకొనడంతో ఆగిపోయారు. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం, నిమ్స్ పాలకవర్గం మొండివైఖరిలో మార్పు రాకపోవడంతో మళ్లీ నవంబర్ ఏడు నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు ప్రకటించారు.
నిమ్స్ లో ప్రారంభంలో 600 వరకు బెడ్లు ఉండగా దాదాపు 400 మంది వరకు రెగ్యులర్ నర్సులుండే వారు. క్రమేణా వార్డుల సంఖ్య పెంచడంతో బెడ్లు 1500కు చేరాయి. వీటికి తోడు మరో 500 వరకు ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ తో అవుట్ పేషెంట్ల కూడా వేల సంఖ్యలో వస్తున్నారు. కరోనా సమయంలో కొంత తగ్గినప్పటికీ సాధారణ రోజుల్లో వేల సంఖ్యలో వచ్చే రోగులను తక్కువ మంది సిబ్బంది చూడాల్సి ఉంటుంది. కాంట్రాక్టు నర్సులు మరో 400 మంది ఉన్నప్పటికీ వారి డిమాండ్లను కూడా దీర్ఘకాలంగా నెరవేర్చకపోవడంతో తరచూ ఆందోళన చేస్తున్నారు. అలాంటి సమయాల్లో ఉన్న కొద్ది మంది రెగ్యులర్ నర్సులపై పని భారం మరింత పెరుగుతున్నది. ఇప్పుడున్న సిబ్బందికి రెట్టింపు నర్సులు కోరుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో రోగులకు అందుతున్న సేవల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అయినా పాలకవర్గంలో చలనం రావడం లేదని నర్సులు విమర్శిస్తున్నారు.
దీనికి తోడు నర్సుల పట్ల పాలకవర్గం ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపిస్తున్నదనే విమర్శ ఉన్నది. పదోన్నతులు కల్పించే విషయంలో ఇంకా ఆంధ్ర, తెలంగాణలో స్పష్టత రాలేదని చెప్పిన వారే డాక్టర్లకు, పాలనా విభాగంలో సిబ్బంది ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. గత నాలుగేండ్లుగా కుటుంబ నియంత్రణ నిధి కింద ఒక్కో ఉద్యోగి నుంచి చట్టవిరుద్ధంగా చట్టవిరుద్ధంగా వసూలు చేసిన రూ.50 వేలు తిరిగి ఇవ్వడం లేదు. 2019 నుంచి ఇఎల్ ఎన్ క్యాష్ మెంట్ చేయడం లేదు. నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ కేడర్పై సమీక్షించాలన్న డిమాండ్ ను కూడా పట్టించుకోవడం లేదు. రోజు రోజుకు సమస్యలు పేరుకుపోతుండడంతో సమ్మె తప్ప తమకు వేరే మార్గం లేదని నర్సులు అభిప్రాయపడుతున్నారు.