Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ విధానాలకు నిరసనగా 26న సార్వత్రిక సమ్మె
- జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సదస్సు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్, స్వదేశీ జపం లాంటి మాయమాటలతో దేశాన్ని కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెడుతూ దేశాన్ని పరాధీనత వైపు తీసుకెళ్తున్నారని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, అన్నితరగతుల ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం రాష్ట్రసదస్సు నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ పెట్టుబడిదారులు తమ లాభాపేక్ష కోసం పనిచేస్తారు తప్ప దేశప్రయోజనాలు వారికి పట్టవనే విషయాన్ని మోడీ సర్కారు గుర్తెరగాలని హితవు పలికారు. రాజ్యాంగ విలువలకు మోడీ సర్కారు తిలోదకాలు ఇస్తున్నదనీ, తప్పులను ఎత్తిచూపుతూ ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా ముద్రవేయడం దారుణమన్నారు. కార్మికులు, ఉద్యోగులు తమ హక్కులు, దేశ ప్రయోజనాల కోసం పోరాడితే దేశద్రోహులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు నరసింహన్ మాట్లాడుతూ మోడీ సర్కారు నిర్ణయాలను తప్పుబడుతూ ప్రశ్నించే గళాలు పెరగటం శుభపరిణామమన్నారు. దేశాన్ని గుత్తపెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ డబ్ల్యూటీఓకు ఏజెంట్గా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ బీజేపీ తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నదన్నారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓపక్క ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకున్నదని విమర్శించారు.
ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను, కార్మికులను ఆదుకోకుండా కార్పొరేట్లకు సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడం దారుణమన్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్కే బోస్ మాట్లాడుతూ అధికారం చేతుల్లో ఉందికదా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే మోడీ సర్కారు ధోరణి సరిగాదన్నారు. ఐఎఫ్టీయూ ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కార్మికవర్గాన్ని చీల్చే కుట్ర జరుగుతున్నదన్నారు. ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బెఫి నాయకులు వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రయివేటీకరణ వల్ల రక్షణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే తదితర కీలక రంగాలు మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయనీ, ఫలితంగా పెట్టుబడులు స్టాక్మార్కెట్లకు మళ్లి ప్రజలకు రుణాలివ్వడం తగ్గుతుందని వివరించారు.
ఇన్సూరెన్స్ రంగం నాయకులు క్లమెంట్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి బంగారుబాతుగుడ్డులా ఉపయోగపడుతున్న ఎల్ఐసీని నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమన్నారు. ఏఐడీఈఎఫ్ నేత జీటీ గోపాల్రావు మాట్లాడుతూ రక్షణ వ్యవస్థను అమెరికా చేతుల్లో పెట్టడం దేశసమగ్రతకే ప్రమాకరమని హెచ్చరించారు. ఆర్డీనెన్స్ ఫ్యాక్టరీలను కాపాడుకునేందుకు పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్న తీరును వివరించారు. ఫార్మా రంగం నుంచి రాజుభట్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐడీపీఎల్ను తీసేయడం వల్ల నేడు రోగాలకు మందులను ప్రయివేటు కంపెనీల వద్ద కొనుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. బంగారంపై మూడు శాతం జీఎస్టీ వేసి మెడిసిన్పై 12 శాతం విధించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి అజీజ్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సదస్సు తీర్మానాలు ఇవే..
- రాష్ట్రంలోని కార్మికవర్గాన్ని చైతన్యపరిచేలా సమ్మె క్యాంపెయిన్ కొనసాగాలి.
- జిల్లాల్లో కార్మిక సంఘాల సంయుక్త సమావేశాలు ఈ నెల 30లోపు జరపాలి.
- జిల్లా సదస్సులు నవంబర్ 15 లోపు పూర్తి చేయాలి.
- ఉమ్మడి కరపత్రం, పోస్టర్ను విస్తృతంగా పంపిణీ చేయాలి. సోషల్మీడియా ద్వారా ప్రచారంలో పెట్టాలి.
- పబ్లిక్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్, సింగరేణి, డిఫెన్స్, బీడీ, మున్సిపల్, హౌటల్ వర్కర్స్ రాష్ట్ర సదస్సులు నిర్వహించాలి.
- పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సదస్సులు నిర్వహించాలి.
- అన్ని పీఎస్యులలో ఉమ్మడి గేట్ మీటింగ్లు, సదస్సులు జరపాలి. ప్రతి సంస్థలోనూ సమ్మె నోటీసులివ్వాలి.
- నవంబర్ 8న ఐదు లక్షల మందితో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించాలి.
- నవంబర్ 10-12 తేదీల్లో విస్తృతంగా సమ్మె నోటీసులివ్వాలి.
- నవంబర్ 20-24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీలు, ప్రభాత భేరీలు జరపాలి.
- సమ్మె రోజు పారిశ్రామిక ప్రాంతాలు, మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు జరపాలి.
- హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే సభకు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక, సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరుకావాలి.