Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుపై 15 రోజులకోసారి నివేదిక సమర్పించండి :డీఐఈవోలకు ఇంటర్ విద్యాకమిషనర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా?అని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల హాజరుపై 15 రోజులకోసారి నివేదిక సమర్పించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు (డీఐఈవో)ను ఆదేశించారు. కోవిడ్-19 నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తరగతులు నిర్వహించడం సాధ్యం కాలేదని వివరించారు. అయితే యూజీసీ, సీబీఎస్ఈ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయని తెలిపారు. జీరో విద్యాసంవత్సరం కాకుండా చర్యలు తీసుకోవాలని వివరించాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు రోజు విడిచి రోజు 50 శాతం చొప్పున హాజరవుతున్నారని వివరించారు. మిగిలిన 50 శాతం మంది అధ్యాపకులు ఇంట్లో నుంచి ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించాలని కోరారు. విద్యార్థుల హాజరుశాతం ఎలా ఉందో పరిశీలించాలని తెలిపారు. డీఐఈవోలు, నోడల్ అధికారులు ఆన్లైన్ తరగతులను పర్యవేక్షించాలనీ, విద్యార్థుల హాజరుపై 15 రోజులకోసారి నివేదిక సమర్పించాలని కోరారు.