Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సర్కారు దిష్టిబొమ్మ దహనం
- అణచివేయాలనుకోవడం సర్కారు భ్రమ : పాలడుగు, రమ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు, కార్మికులు, కూలీలపై కేంద్ర ప్రభుత్వం నిర్భంధం ప్రయోగించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిర్భంధకాండకు వ్యతిరేకంగా శనివారం గోల్కొండ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్యర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, రైతులపై దమనకాండ ఆపాలనీ, మోడీ సర్కారు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్నంపెట్టే రైతులపై తూటాలా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఎస్ రమ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుతున్నదన్నారు. ఈ చట్టాలతో వ్యవసాయ రంగం దివాళాతీసి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తున్నదన్నారు. కార్మిక చట్టాలను సవరించి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించిన రైతులు, కార్మికులు, కూలీపై కేంద్ర సర్కారు భాష్పవాయుగోళాలు, ఫిరంగులతో దాడులు చేసిందన్నారు.అన్నదాతలపై లాఠీచార్జి చేసి, తూటాలు పేల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భంధంతో ప్రజాఉద్యమాలను అణచివేయాలనుకోవడం కేంద్ర ప్రభుత్వ భ్రమ అవుతుందన్నారు. కార్మికవర్గం రైతుకు అండగా ఉంటుందనీ, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలిపారన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలు నిర్వహిస్తామన్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిచే ప్రభుత్వ ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే కార్మికులు, రైతులు సర్కారుకు గోరి కడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, కూరపాటి రమేష్, సుధాకర్, వై సోమన్న, నగర నాయకులు వెంకటేష్, వాణి, కామేష్, నరేష్, అరుణజ్యోతి,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.