Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్
- ధనిక రాష్ట్రంలో ఐఆర్, పీఆర్సీ ఏది?: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నీరటి కిష్టయ్యకు ఘన సత్కారం
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
నేతలు, ఉపాధ్యాయులు గళమెత్తితేనే విద్యారంగ సంస్థలకు రక్షణ చేకూరుతుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నీరటి కిష్టయ్య మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తాటికొండలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా శనివారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా రంగం ప్రభుత్వ ఆధినంలో ఉంటేనే బావుంటుందనే విషయం ప్రభుత్వానికి కరోనాతో తెలిసొచ్చిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. వైద్యరంగం ప్రయివేట్ రంగంలో ఉండటం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు కనీసం చికిత్స కూడా అందించలేదన్నారు. ఆ తర్వాత కరోనా రోగులకు చికిత్స అందించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన సందర్భాలున్నాయన్నారు. రాష్ట్రంలోని 23 వేల పాఠశాలల్లో కనీసం స్వీపర్లు కూడా లేరన్నారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీకానందున విద్యారంగం కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ప్రయత్నిస్తేనే ప్రభుత్వ బడులు బాగుపడతాయన్నారు. అందుకు ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి, ఉద్యోగ విరమణ వయసు పెంపు, ఐఆర్, పీఆర్సీ, ఇతర సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నాయకత్వ బలహీనతల వల్లే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యా యులు, ఉద్యోగులు ఐక్యంగా హక్కుల సాధనకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ విరమణ వయసు 60 ఏండ్లు పెంచడం ప్రభుత్వానికి కష్టం కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పాఠశాలలు తెరిచి విద్యారంగాన్ని కాపాడాలని కోరారు. అంతుకుముందు ఎమ్మెల్సీలతో పాటు సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రవి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల జిల్లా విద్యాధికారులు ఉషారాణి, రవీందర్ ఉపాధ్యాయుడు కిష్టయ్య సేవలను కొనియాడారు. అనంతరం నీరటి కిష్టయ్యకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉమాదేవి, రవికుమార్, టీఎస్ యూటీఎఫ్ మాజీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటప్ప, రఘుపాల్, వెంకటేష్, వాయిస్ ఆఫ్ టీఎస్ యూటీఎఫ్ సంపాదకులు మాణిక్ రెడ్డి, పీటీ నిరంజన్, ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.