Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పెండ్లికి నిరాకరిస్తారేమోనని ఉరేసుకున్న వైనం..
నవతెలంగాణ-ఆర్మూర్
తమ పెండ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరిస్తారో లేదోనన్న ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్లోని పెర్కిట్ శివారు మామిడితోటలో శనివారం జరిగింది. సీఐ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన రోహిత్(17), ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్బోర్డ్ కాలనీకి చెందిన అవంతిక(18) ప్రేమించుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అవంతిక ఇంటర్ పూర్తి చేసుకోగా, రోహిత్ ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ప్రయివేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇద్దరి సామాజిక తరగతులు ఒకటే అయినప్పటికీ.. యువకుడి కంటే యువతి ఒక ఏడాది పెద్దది కావడంతో తమ పెండ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరిస్తారో లేదోనని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ మామిడితోటలో ఒకే చున్నీతో చెట్టుకు ఉరేసుకున్నారు. తోటపని వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రాఘవేందర్, ఎస్ఐ విజయ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ రాఘవేంద్ర తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులకు అప్పగిస్తే బతికేవారేమో..
ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు శుక్రవారం రాత్రి పోలీసుల పెట్రోలింగ్ వాహనానికి కనిపించినట్టు సమాచారం. ఇదే విషయం సీఐ సైతం ధ్రువీకరించారు. అప్పుడే వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే బతికుండేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని అవంతి అనడంతో వారిని పెట్రోలింగ్ వాహనంలో తీసుకెళ్లి హౌజింగ్ బోర్డు కాలనీలో దించేసినట్టు సమాచారం.