Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం కూకట్పల్లిలోని ఉషా ముళ్లపూడి కమాన్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం ఎంఐఎం నేతల కబ్జాలో ఉందని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న నిజాం వారసులకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన్ ద్వారా యూపీలో 35 లక్షల మందికి ఇండ్లు కట్టించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో ఎంతమందికి ఇండ్లు కట్టించిందో చెప్పాలని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే గెలిపించాలని కోరారు. అనంతరం శాలిబండ, లాల్ దర్వాజ్లో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు చెప్పారు. 400 ఏండ్లకుపైగా కార్యరూపం దాల్చని అయోధ్య రామమందిర వివాదాన్ని పరిష్కరించుకొని.. ఆలయాన్ని ఇప్పుడు నిర్మించుకుంటున్నామన్నారు. ప్రధాని మోడీ పేద రైతులకు రూ.ఆరు వేలు అకౌంట్లలో జమ చేస్తుంటే.. వరద సాయాన్ని కేసీఆర్ లబ్దిదారుల అకౌంట్ల ద్వారా ఎందుకు అందించలేకపోయారని యోగి ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే సర్కార్ వరద సాయం నగదు రూపంలో పంపిణీ చేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి నగరవాసులకు అన్యాయం చేస్తోందన్నారు. తండ్రి, కొడుకు కలిసి ప్రజల సొత్తును దొచుకుంటున్నారని.. వ్యాపారులను భయపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు మురళీధర్రావు, పెద్దిరెడ్డి, జితేందర్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పాల్గొన్నారు.