Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుఫాన్ ప్రభావంతో అతలాకుతలం
- వరుస వర్షాలతో రైతుకు కన్నీళ్లు
నవతెలంగాణ-అశ్వారావుపేట/అన్నపురెడ్డిపల్లి
వరుస వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి.. ఇప్పటికే సగానికిపైగా పైర్లు నష్టపోగా.. ఇప్పుడు 'నివర్' వచ్చిపడింది. వరిని కోసిన ధాన్యాన్ని కొంత మంది రైతులు కల్లాల వద్ద, మరికొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. నేడోరేపో ధాన్యం కొనుగోళ్లు అయ్యాక వచ్చే డబ్బులతో అప్పులు కట్టాలనుకున్నారు.. కానీ ఇంతలోనే నివర్ తుపాన్ రూపంలో వచ్చిన వర్షం ధాన్యాన్ని ఆగం చేసింది. చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతు పడని శ్రమ లేదు. టార్పాలిన్లు కప్పినా వరుసగా రెండు మూడ్రోజులు వర్షం పడటంతో ధాన్యం తడిసింది. శనివారం ఉదయం పట్టాలు తీయగా.. అప్పటికే మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో సుమారుగా 7 వేల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. 5 వేల ఎకరాలకు పైగా రైతులు వ్యవసాయ అధికారుల వద్ద కోత అనుమతికి కూపన్లు తీసుకున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లోపు వరి పంట కోతలు కోశారు. ధాన్యాన్ని మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 కొనుగోలు కేంద్రాలకు వారం రోజుల నుంచి రైతులు తరలిస్తున్నారు. మరికొందరు రైతులు తమ వ్యవసాయ క్షేత్రం వద్ద పంటను ఆరబోశారు. ధాన్యంపై పట్టాలు కప్పినప్పటికీ వర్షానికి అడుగు భాగాన ఉన్న గింజ మొలకెత్తింది. మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ధాన్యం రాశిలో సుమారు నాలుగు బస్తాల ధాన్యం తడిసినట్టు చెబుతున్నారు. కేంద్రాలు ప్రారంభించి వారం కావొస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కొర్రీలు పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం, అన్నపురెడ్డిపల్లి తదితర గ్రామాల్లో కోసిన వరి ధాన్యం సుమారు 200 ఎకరాల్లో నీట మునిగింది. 800 ఎకరాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల వద్ద ఆరబోశారు. వర్షానికి అడుగుభాగాన పంట తడిసింది. దీంతో మొలకెత్తింది. పొలం మీద తడిసిన పంట రంగు మారే అవకాశం ఉంది. రాజాపురంలో భారీ వర్షం కురవడంతో పంట నీట మునిగింది. నీటిని బయటకు తీయడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. అన్నపురెడ్డిపల్లిలో నీట మునిగిన వరిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాణవత్ భీముడు పరిశీలించారు. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దుమ్ముగూడెం, భద్రాచలం, చర్ల మండలాల్లో పైరు నేలకొరిగింది. నేలకొరిగిన పైరును కోయాలంటే అదనపు భారం అవుతుందని రైతులు అంటున్నారు. తల్లాడలో సుమారు 10 ఎకరాల్లో పంట నీట మునిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసి మొలక వచ్చింది.
అప్పు తెచ్చి సాగు చేశాను
కుర్సం జోగయ్య- తిరుములకుంట- అశ్వారావుపేట
అప్పు తెచ్చి వరి సాగు చేశాను. వరి కోసి ధాన్యం అమ్మాలంటే తేమ శాతం తగ్గితేనే కొనుగోలు జరుపుతారనే నిబంధన వల్ల కల్లంలో ఆరబోశాను. తీరా తుఫాన్ వచ్చి పంటను ఆగం చేసింది.
గిట్టుబాబు ధర కల్పించాలి:కన్నయ్య- అచ్యుతాపురం
గిట్టుబాటు ధర కోసం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాం. విపత్తు వచ్చిపడింది. అయినా తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా కొందరు రైతుల పంట తడిసింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలి.