Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన రాజకీయాలకు లొంగితే తీవ్రంగా నష్టపోతాం...
- రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులు కావొద్దు
- గోల్మాల్ గావొద్దు.. మాయలో పడొద్దు...
- ప్రభుత్వరంగ సంస్థలకు అండగా ఉంటాం
- ప్రధాని మోడీని రూ.1,300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు
- జీహెచ్ఎమ్సీలో వంద కంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం
- డిసెంబరు ఏడు నుంచి మళ్లీ వరద సాయమిస్తాం : బహిరంగ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలను నిశితంగా ఎండగడుతూ, ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నందుకే మా మీద, తెలంగాణ మీద బీజేపోళ్లు దండయాత్ర చేస్తున్నరు. కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ఆ పార్టోళ్లు వరదలా హైదరాబాద్ మీదికి వస్తున్నరు...' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మాత్రం వీరిలో ఏ ఒక్కరూ కనీసం పరామర్శకు రాలేదని విమర్శించారు. ఎయిరిండియా, రైల్వేలు, ఎల్ఐసీలాంటి ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు తెగనమ్ముతున్నారని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సంస్థలను సైతం ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని అన్నారు. ఆయా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వాటికి, అందులో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీనిచ్చారు. జీహెచ్ఎమ్సీలో వందకు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికల నేపథ్యంలో శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ఆధ్వర్యాన భారీ బహిరంగ
సభను నిర్వహించారు. ఆ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో... కేసీఆర్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల కాలంలో జీహెచ్ఎమ్సీ పరిధిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఏకరువు పెట్టారు. నగరానికి ఇప్పటికే ఎంతో చేశామనీ, మున్ముందు ఇంకెంతో చేస్తామంటూ హామీనిచ్చారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పటి బీజేపీ విధానాలను తూర్పారబట్టారు. ఈ రెండు పార్టీలూ ఇండియాను నడపటంలో విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కారు రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరినీ, నిధుల విషయంలో ప్రదర్శిస్తున్న వివక్షనూ ఎత్తి చూపారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీకి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ప్రజలను, ముఖ్యంగా యువతను రెచ్చగొడుతూ ప్రసంగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలకు లొంగిపోతే తీవ్రంగా నష్టపోతామంటూ ఓటర్లను హెచ్చరించారు. విషం
చిమ్మే ప్రసంగాలకు ఆకర్షింపబడితే... ఆగమైపోతామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రజలను చైతన్యపరిచేందుకు మేధావులు, ప్రగతిశీల శక్తులు, పార్టీలు, అభ్యుదయవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా శాంతి భద్రతలతో, మత సామరస్యంతో అందమైన పూలబొకేలాగా ఉన్న హైదరాబాద్ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎమ్సీలో ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో... 'ఇవి మున్సిపల్ ఎన్నికలా..? లేక నేషనల్ ఎలక్షన్లా...?' అని కేసీఆర్ ప్రశ్నించారు. 'హైదరాబాద్కు మొన్న వర్షంతో కూడిన వరదొచ్చింది... ఇప్పుడు బీజేపోళ్ల వరదతోపాటు రాజకీయ బురద కూడా వచ్చింది...' అంటూ విమర్శించారు. బక్కగున్న కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది వస్తున్నరంటూ వ్యాఖ్యానించారు. తమ తమ రాష్ట్రాలను బాగు చేసుకోలేని బీజేపీ నేతలు... తెలంగాణకు వచ్చి మాయ మాటలు చెబుతున్నారని అన్నారు. అలాంటి గోల్మాల్ వ్యవహారాలు, మాయామశ్చీంద్రల మాయలో పడొద్దని సూచించారు. హైదరాబాద్కు వరదలొచ్చాయి.. రూ.1,300 కోట్ల తక్షణ సాయం కావాలంటూ కోరితే ప్రధాని మోడీ ఇప్పటి వరకూ 13 పైసలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓర్పు.. సమన్వయం...
తెలంగాణ వచ్చిన తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలనూ తమ ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ఎంతో ఓర్పు, సహనంతో వ్యవహరించామని తెలిపారు. చాలినన్ని నిధుల కూర్పుతో హైదరాబాద్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు మరోసారి జీహెచ్ఎమ్సీలో టీఆర్ఎస్ను గెలిపిస్తే... మున్ముందు మరెన్నో కార్యక్రమాలను చేసి చూపెడతామని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు 20 వేల లీటర్ల వరకూ ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని వివరించారు. సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తామని మరోసారి హామీనిచ్చారు.
తిట్టలేక కాదు..
కొన్ని పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. తనను కూడా పరుష పదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. వారిని తిరిగి తిట్టాలంటే అంతకంటే ఎక్కువగానే తిట్టగలమని అన్నారు. 60 లక్షల మంది కార్యకర్తలున్న టీఆర్ఎస్ రంగంలోకి దిగితే... మిగతా వారికి దమ్ము నశాళానికి ఎక్కుతుందని హెచ్చరించారు. కానీ బాధ్యతగల పార్టీగా ఓపిక, సహనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. తమకు ఢిల్లీలో బాస్లు లేరనీ, తెలంగాణ ప్రజలే కేసీఆర్కు బాస్లని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
పలచబడ్డ జనం...
టీఆర్ఎస్ సభ సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. దీనికి హాజరయ్యేందుకు వీలుగా పలు డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలు, ప్రజలను తరలించారు. దీంతో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభికులు.. ముఖ్యంగా మహిళలు స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోవటం కనిపించింది. కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కూడా చాలా మంది స్టేడియాన్ని వీడి రోడ్డు మీదికి పోయారు. దీంతో మైదానానికి ఇరువైపులా, మధ్యలోనూ ఖాళీగా కనిపించింది. బహిరంగ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. మంత్రులు తలసాని, శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్తోపాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులూ హాజరయ్యారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న 150 మంది అభ్యర్థులను కేసీఆర్ సభకు పరిచయం చేశారు.
కిరికిరి పెట్టిన్రు...
నగరానికి వరదలొచ్చి జనం అల్లాడుతున్న క్రమంలో దాదాపు ఆరున్నర లక్షల మంది బాధితులకు రూ.650 కోట్ల మేర ఆర్థిక సాయం చేశామని సీఎం గుర్తు చేశారు. ఇంకో మూడు నాలుగు లక్షల మంది మిగిలి ఉంటే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సాయాన్ని కూడా అడ్డుకుంటూ కొన్ని పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి... కిరికిరి పెట్టాయని విమర్శించారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డ తర్వాత, డిసెంబరు ఏడు నుంచే మిగిలిన వారందరికీ సాయాన్ని అందజేస్తామని హామీనిచ్చారు.