Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ప్రజాసంఘాల హెచ్చరిక
- కేసీఆర్ కలిసి రావాలని డిమాండ్..
- రాస్తారోకో...అరెస్టులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా ప్రజాసంఘాలు రాస్తారోకో ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసేదాకా కేంద్రాన్ని వదలబోమని హెచ్చరించాయి. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గొల్కోండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టాయి. వందలాది మంది ర్యాలీగా బయలుదేరి రోడ్డుపై బైటాయించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. మోడీ డౌన్ డౌన్, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, మోడీ నిరంకుశ వైఖరి విడనాడాలంటూ గొంతెత్తారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రోడ్డు మీద భైఠాయించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఏడబ్య్లూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల రద్దు కోసం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ కోసం ఢిల్లీలో రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రనిర్భందం ప్రయోగించడాన్ని ఖండించారు. బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేకమైందని విమర్శించారు. ఈ చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమా? అనుకూలమా? చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారనీ, ఆ తర్వాత వాటిపై ఏమీ మాట్లాడటం లేదన్నారు. ఈ చట్టాలకు టీఆర్ఎస్ వ్యతిరేకమైతే నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అరెస్టులు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దిగొచ్చి కేంద్రం తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా...కేంద్రానికి చీమకుట్టినట్టైనా లేదని విమర్శించారు.
బీజేపీ సర్కారు రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేక వారి మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4డిగ్రీల చలిలోనూ రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారనీ, ఉద్యమంపై ఫిరంగులు, బాష్పవాయుగోళాలు ప్రయోగించి, రైతులను భయాందోళనకు గురి చేస్తున్నదని విమర్శించారు. ఈ ఉద్యమం సందర్భంగా కొంత మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను రద్దు చేసేదాక ఉద్యమం ఆగబోదని తెలిపారు. రైతాంగ పోరాటానికి మద్దతుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని కోరారు. పట్నం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి డిజి నరసింహరావు మాట్లాడుతూ చట్టాలను రద్దు చేసేదాక ఉద్యమం సజీవంగా కొనసాగుతుందని తెలిపారు. మోడీ సర్కారు నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ పునరాలోచించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి, మూడ్శోభన్ (తెలంగాణ రైతు సంఘం), పుణ్యవతి, టి జ్యోతి, (ఐద్వా), జి నాగయ్య (వ్యవసాయ కార్మిక సంఘం), రాజారావు, పాలడుగు భాస్కర్, వంగూరు రాములు, ఎస్ రమ, పి జయలక్ష్మి, కోటంరాజు (సీఐటీయూ), ఎంవి రమణ (చేతివృత్తిదారులు సమన్వయకమిటీ), విప్లవ్, విజయకుమార్ (డివైఎఫ్ఐ), శ్రీరాంనాయక్, బండారు రవికుమార్ (గిరిజన సంఘం), కె పార్థసారధి, సి రామచంద్రారెడ్డి, వెంకటేష్, ఈశ్వర్జిత్తేందర్(ఐలు), జావేద్ (ఎస్ఎఫ్ఐ), అబ్బాస్ (ఆవాజ్), లెల్లెల బాలకృష్ణ (టీఎంకేఎంకేఎస్), కొమ్ము విజయకుమార్(కేవీపీఎస్), నరేష్ (రజకవృత్తిదారులు), నగర నాయకులు ఎం శ్రీనివాస్, కామేష్, ఆర్ వెంకటేష్, అరుణజ్యోతి, స్వర్ణలత, భవాని తదితరులు పాల్గొన్నారు.