Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపికైన విద్యార్థులు 19 వరకు ప్రవేశం పొందాలి
- కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం గతనెల ఒకటిన నిర్వహించిన గురుకుల సెట్-2020 రాతపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు సెట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తొలివిడతలో ఎంపికైన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరంలో ఐదో తరగతిలో ఈనెల 7 నుంచి 19 వరకు వారికి కేటాయించిన గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం పొందాలని కోరారు. బదిలీ ధ్రువపత్రం, కులధ్రువీకరణ, ఆదాయపత్రాలతోపాటు బోనఫైడ్ సమర్పించాలని సూచించారు. ప్రవేశం పొందని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని వివరించారు. తొలివిడతలో ప్రవేశం పొందని సీట్ల భర్తీకి రెండోవిడత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కేవలం ప్రవేశం పొందే అవకాశం కల్పిస్తున్నామనీ, ప్రభుత్వ అనుమతి తర్వాత వారికి గురుకులాల్లో ప్రత్యక్ష బోధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివిధ గురుకులాల్లో కలిపి 46,937 సీట్లు అందుబాటులో ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. తొలివిడతలో 46,937 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ ఫలితాల కోసం www.tswreis.in, http://tgcet.cgg.gov.in, http://mjptbcwreis.telangana.gov.in, http://tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in, http:/mjptbcwreis.cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని కోరారు.