Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురికి అస్వస్థత
నవతెలంగాణ-చండూరు
విషం కలిసిన ఈత కల్లు తాగి ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని తుమ్మలపల్లిలో జరిగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మారెడ్డిగూడెం వాస్తవ్యులు గజ్జల రాఘవరెడ్డి దగ్గర అదే గ్రామానికి చెందిన రాసాల నరసింహ(56) పని చేస్తున్నాడు. తుమ్మలపల్లి గ్రామ శివారు వద్ద ఉన్న రాఘవరెడ్డి భూమిలోని ఈత చెట్టుకు కల్లు పారుతోంది. ఈత చెట్టుకు పురుగు వచ్చిందని, మందు పెట్టాలని రాఘవరెడ్డి ఇంట్లో అన్నాడు. అయితే, రాఘవరెడ్డికి చెప్పకుండా ఇంట్లో వాళ్లు ఈత చెట్టుకు పురుగు చనిపోయేందుకు మందు పెట్టించారు. ఈ విషయం తెలియని రాసాల నరసింహతోపాటు మల్లికార్జునరెడ్డి, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జక్కుల కొండయ్య, గజ్జల లక్ష్మమ్మ శుక్రవారం పనికెళ్లి.. ఉదయం ఈతచెట్టుకు ఉన్న లొట్టిని దీంచుకుని కల్లు తాగారు. దాంతో తీవ్ర అస్వస్థతకు గురై రాసాల నరసింహ(56) మృతిచెందాడు. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు.