Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారు షెడ్డుకు పోవాల్సిందే
- మా టార్గెట్ 2023 :బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ను గెలిపించేందుకు ఆ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు, బీజేపీ కార్యకర్తలపై ఎంఐఎం, టీఆర్ఎస్ వాళ్లు దాడులకు పాల్పడ్డా చూసీచూడనట్టు వ్యవహరించిన డీజీపీకి గెలుపును అంకితం ఇస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఫలితాల ప్రకటన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లో ముందు సర్జికల్ స్ట్రైక్ చేద్దామనుకున్నామనీ, ఇంతలోనే గ్రేటర్ ఎన్నికలు రావడంతో సాఫ్రాన్ స్ట్రైక్ చేశామని చెప్పారు. దుబ్బాక ఫలితంతో అల్లుడి దిమ్మ తిరిగిందనీ, గ్రేటర్ ఫలితంతో కొడుక్కి పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. దుబ్బాకలో కారుకు బ్రేకులు వేశామనీ, హైదరాబాద్లో ఫంక్చర్ పడ్డదనీ, 2023లో ఆ కారు షెడ్డుకు పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇక ప్రతి ఎన్నికలోనూ తెలంగాణలో ఇవే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మతం పేరుతో విధ్వంసాలను సృష్టిస్తారనే తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు. ఈసీ తప్పుడు సర్క్యూలర్ను జారీ చేయడం దారుణమన్నారు. కేంద్ర హోం మంత్రి జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బలాన్ని చేకూర్చాయన్నారు.ప్రజలిచ్చిన తీర్పును కూడా అంగీకరించకుండా బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్లు నిర్వహించడం, గెలిచినట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. స్వతంత్రంగా పోటీచేసి మినీ తెలంగాణ అయిన హైదరాబాద్లో ఓటింగ్ శాతాన్ని, సీట్లను పెంచుకున్నామనీ, రానున్నరోజుల్లో బీజేపీ గెలవడానికి మైలురాయిగా గ్రేటర్ ఫలితాలు నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఓటమికి నైతికత వహిస్తూ కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి జరగాల్సి ఉండగా ఓటమి భయంతోనే ఆదరాబాదరాగా ముందుకు రాష్ట్ర ప్రభుత్వం జరిపిందనీ, అయినా టీఆర్ఎస్ చావుతప్పి కన్నులొట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దేశంలోనే నెంబర్వన్ అవినీతిపరులుగా ఉన్న కల్వకుంట్ల కమిషన్ రావు(కేసీఆర్)కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కేటీఆర్ ఫెయిలూర్ వల్లనే టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, తదితరులు పాల్గొన్నారు.