Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పేదల ఆధీనంలో ఉన్న భూమికి వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో సర్వేనెంబర్ 832లో 14 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న వారిని శుక్రవారం కలిశారు. వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ నాలుగు నెలలుగా గుడిసెలు వేసుకొని పేదలు జీవిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భూమిలో 11 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం వెంటనే ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. గ్రామంలో అత్యధికంగా దళితులకు సొంత ఇండ్లు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి ఆ భూమిని భూమిలేని పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులకు ఆశపడిన రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని భూ బకాసురులకు అక్రమంగా పట్టాలు చేశారని, ఈ భూమిపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహిస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేదలందరికీ ఇండ్ల పట్టాలు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మేకనబోయిన శేఖర్, భూపోరాట కమిటీ నాయకులు చెరుకుపల్లి కష్ణయ్య, బచ్చలకూర సైదులు తదితరులు పాల్గొన్నారు.