Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ ఫలితాలతో కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు
- మూడేండ్ల తరువాత కాంగ్రెస్దే అధికారం
- విలేకరుల సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేసీఆర్ పేదల సొమ్మును అప్పనంగా దోచుకోవడానికి తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈనెల 9న ఆందోళన చేపడతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఫలితాలను చూసి కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని సూచించారు. మరో మూడేండ్ల తర్వాత కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ, బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టులు, ఫార్మా కంపేనీల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. ధరణి వెబ్సైట్ తలాతోకలేని కార్యక్రమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాయితీలు తప్పితే కేసీఆర్ ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. 57ఏండ్లకే పింఛన్, నిరుద్యోగులకు భృతి హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు నల్లగొండను దత్తత తీసుకుంటామని మాయమాటలు చెప్పారే కానీ చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.