Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కంపెనీలపై నియంత్రణేది?
- తక్కువ ధరకు సేకరణ... ఎక్కువ ధరకు అమ్మడం
- వెన్న శాతాన్ని తగ్గించి ధరను తగ్గిస్తున్న వైనం
- పేరుకుపోయిన 4 రూపాయల సబ్సిడీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పాల డైయిరీలు రైతును దగా చేస్తున్నాయి. సర్కారు పర్యవేక్షణలో ఉన్న మదర్ డెయిరీతోపాటు ప్రయివేటు డెయిరీలు సైతం రైతును ముంచుతున్నాయి. తక్కువ ధరకు పాలను సేకరించి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పాల ఉత్పత్తి చేస్తున్న రైతులకు నష్టాలను అంటగడుతున్నాయి. వ్యవసాయం తర్వాత రెండవ ప్రధాన జీవనాధారంగా పాల ఉత్పత్తిని రైతులు ఎంచుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు వేలాది మంది రైతులను ఆదుకుంటున్నది. సన్న, చిన్నకారు, పేద రైతులకు పాడి జీవనాధారంగా ఉన్నది. సొంత భూమి లేకపోయినా ఆ కుటుంబాలు పాల పిండుకుని ఉపాధి పొందుతున్నాయి. క్రమక్రమంగా పాల ఉత్పత్తి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పాల రైతుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యం. లీటర్కు 4 రూపాయలు ఇస్తున్నా...రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ 400 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. నల్లగొండ జిల్లాలోనే రూ 23 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంతకు మంచి రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తిని పెంచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. దీంతో ప్రయివేటు డైయిరీలు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నాయి. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారం పాల సేకరణ చేపడుతున్నాయి. అమాయక రైతులను మభ్య పెట్టి వెన్న శాతం తక్కువగా ఉందంటూ మోసం చేస్తున్నాయి.
10 శాతం ఉంటే లీటర్కు రూ 60 ఇవ్వాలి
పాలలో 10 శాతం వెన్న ఉంటే రూ 60 చెల్లించాలనే నిబంధన ఉన్నా...దానిని ఏ కంపెనీ అమలు చేయడం లేదు. ఆవు పాలకు 4.5 శాతం వెన్న వుంటే రూ 30.16 చెల్లించాలి. 5 శాతం ఉంటే బర్రెపాలకు రూ 50, 3 శాతం వెన్న ఆవుపాలకు రూ 40 చెల్లించాలి. దీని ప్రకారం ధరలు అమలు కావడం లేదన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు రూ 4 ఇస్తున్నది. అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. పాల సేకరణలో ప్రయివేటు కంపెనీ మోసాలకు పాల్పడుతున్నాయి. లీటర్ పాలకు సగటున రూ 30 నుంచి 35 మించి ఇవ్వడం లేదు. కొన్ని సందర్భాలల్లో పాల చెడిపోయినట్టు చెప్పి డబ్బులు ఎగవేస్తున్నాయి. ఏండ్ల తరబడి పాలుపోస్తున్నా ప్రయివేటు కంపెనీలు గెదేల సంరక్షణ, దాణా, వైద్యం వంటి సౌకర్యాలను పట్టించుకోవడం లేదు. పాలు సేకరించామా? డబ్బులిచ్చామా? అనే దోరణితోనే ప్రయివేటు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. దీంతోపాటు కల్తీపాలను ప్యాకెట్లతో నింపి వినియోదారులకు అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. సహజంగానే పాల జీవిత కాలం నాలుగు గంటలకు మించి ఉండదు. కానీ మూడు,నాలుగు రోజులు పాలు సజీవంగా ఉంటున్నాయి. పాలలో అనేక రసాయనాలు కలపి చాలా రోజలు నిల్వ ఉంచుతున్నారు. టెట్రా ప్యాకెట్లలో సైతం రెండు నెలలు కూడా చెడిపోకుండా ఉంటున్నాయి. ఇలాంటి పాలు వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఆదుకోని సర్కారు
పాల ఉత్పత్తిదారులను సర్కారు ఆదుకోవటం లేదు. ప్రయివేటు కంపెనీలపై నియంత్రణ లేదు. గతంలో పశుక్రాంతి పేరుతో గెదేలు, ఆవులు సబ్సిడీతో ఇచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ గెదేలు, ఆవులను నామమాత్రం చేసింది. పాల డెయిరీల అభివృద్ధిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అవి రైతులకు అందటం లేదు. మేలుజాతి పశువులు అభివృద్ది చెందాలంటే కృత్రిమ గర్భోత్పత్తి ఎంతో అవసరం. కానీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి పాడి గెదేల నుంచి వీర్యం సేకరించి, నిల్వ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు మందులు, గడ్డి విత్తనాలు, పాలు టెస్టర్లు, చాఫ్ కట్టర్లు, మిల్క్అనలైజర్లు కూడా రైతులకు ఇచ్చి ఆదుకోవాల్సిన సర్కారు...నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ పశు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నది. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు ఇంకా సంప్రదాయంగా పాల ఉత్పత్తి చేస్తున్నారు. పైగా రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి పాల ఇబ్బడిముబ్బడిగా పాల దిగుమతి అవుతున్నాయి. అమూల్, నంది, ఆరోక్య కంపెనీల పాలు వస్తున్నాయి. పాల ధరలను ఈ కంపెనీలు నిర్దేశించే స్థాయి వచ్చాయి. దీనికంతటికి రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతును అన్ని విధాలుగా ఆదుకోకపోవడం, సంరక్షణ చర్యలు తీసుకోకపోవడమేని రైతు సంఘాలు అంటున్నాయి.