Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచన
- కోవిడ్ ఓ జాతీయ విపత్తు : మోడీతో వీడియో కాన్ఫరెన్స్లో కెకె, నామా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు అన్నారు. కరోనా ఓ జాతీయ విపత్తు అని చెప్పారు. దీన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాలనూ, అన్ని రాజకీయ పక్షాలనూ సంప్రదించి ముందుకుపోవాలనే ప్రధాని మోడీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రధాన మంత్రి మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులతో మాట్లాడారు. టీఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె కేశవరావు, లోకసభ నాయకుడు నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు. 'కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ వస్తున్నది. దీన్ని ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మన ముందున్న సవాల్. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా ఓ ప్రణాళిక ప్రకా రం చేయాలి. దీనికోసం ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేవలం వ్యాక్సిన్తోనే సమస్య సమసిపోదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. రెండో దశ కరోనా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగాల్సి ఉంది' అని కేశవరావు వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించడం కోసం అవసరమైన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేశారని చెప్పారు. ముందుగా వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ చైన్ సిద్ధం చేశారని వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీ లూ ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు అమలవుతున్నాయని చెప్పారు. పరీక్షల సంఖ్య బాగా పెరిగిందన్నారు. పరీక్షలు చేసిన వారిలో సగటున 1.1 శాతం మందికి మాత్రమే పాజిటివ్ గా తేలుతున్నదని వివరించారు. రికవరీ దాదాపు 96 శాతంగా ఉందన్నారు. చనిపోతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.