Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠరేపిన జీహెచ్ఎంసీ ఫలితాలు
- ఏ పార్టీకీ దక్కని స్పష్టమైన మెజార్టీ
- 55 స్థానాలతో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
- బీజేపీకి 48 సీట్లు.. ఎంఐఎం 44
- రెండు స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
- హైకోర్టు ఆదేశాలతో నేరేడ్మెట్ ఫలితం నిలిపివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉత్కంఠ, ఉద్విగ, ఉద్వేగాల మధ్య హోరాహోరీగా సాగి.. ఉత్కంఠ రేపిన జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ప్రచారంలోలాగే.. ఓట్ల లెక్కింపులోనూ నువ్వా.. నేనా? అన్నరీతిలో సాగింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99వార్డులను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఈసారి 55వార్డులకే పరిమితమైంది. టీఆర్ఎస్ 100స్థానాలను కైవసం చేసుకుంటుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ గతం కంటే తగ్గాయి. గత ఎన్నికల్లో నాలుగు వార్డులకే పరిమితమైన బీజేపీ ఈసారి 48వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ గెలిచిన 42 స్థానాలు టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం. ఎంఐఎం మాత్రం వార్డులు మారినా 44 స్థానాలను కాపాడుకుంది. ఇదిలా ఉండగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సందర్భంగా బీజేపీ 85 స్థానాల్లో అధిక్యంలో ఉండటంతో ఒక్కసారిగా ఉత్కంఠ రేపింది. కానీ తర్వాత ఫలితాలు తారుమారయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 149 వార్డుల ఫలితాలు ప్రకటించింది. కోర్టు ఆదేశాలతో నేరెడ్మెట్ ఫలితాలను ఆపేశారు.
స్పష్టమైన మెజార్టీ కరువు
గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఏ ఒక్క పార్టీకీ 60 దాటలేదు. దీంతో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి హంగ్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 150 వార్డులకు ఒకవేళ 52 ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకుంటే సభ్యుల సంఖ్య 202కు చేరుతుంది. ఈ లెక్కల ప్రకారం మేయర్ పీఠం దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 102 కావాలి. ఈ లెక్క చూసినా ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేదు.
శివారులో కారు..
శివారు ప్రాంతాల్లోని ఎల్బీనగర్ మినహాయిస్తే టీఆర్ఎస్కు మెరుగైన ఫలితాలే వచ్చాయి. కోర్సిటీలో మాత్రం గులాబీ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉప్పల్ నియోజకవర్గంలో రెండు వార్డుల్లో కాంగ్రెస్, మరో రెండు వార్డుల్లో బీజేపీ.. మిగిలిన వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండింటికి రెండు వార్డులను బీజేపీ దక్కించుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి మినహా అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 9వార్డుల్లో ఐదు వార్డుల్లో టీఆర్ఎస్, మూడు బీజేపీ గెలిచాయి. నేరేడ్మెట్ వార్డులో హైకోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపును ఆపేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల తప్ప అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. బీఎన్రెడ్డి నగర్లో టీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. మొదట 10 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గెలవగా.. రీకౌంటింగ్ పెట్టగా.. బీజేపీ ఆధిక్యం మరింత పెరిగి.. 32 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఇక్కడ టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ డమ్మీ అభ్యర్థే కావడం గమనార్హం. డమ్మీకి 39 ఓట్లు పోలయ్యాయి.
పట్టునిలుపుకున్న ఎంఐఎం
పాతబస్తీలో మజ్లీస్ పార్టీ పట్టునిలుపుకుంది. 2016ఎన్నికల్లో 44వార్డుల్లో విజయం సాధించిన పార్టీ ఈసారి కూడా 44స్థానాలను నిలుపుకుంది. ఒకటి రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయినా సంఖ్య మాత్రం తగ్గలేదు. మేయర్ పీఠం, పాలకవర్గం ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారే అవకాశాలున్నాయి.
పాత కథే..
గ్రేటర్లో ఒకప్పుడు ఊపేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుమరుగైపోతోంది. 2016 ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా రెండు స్థానాలకే పరిమితమైంది. ఇక తెలుగుపార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. గత ఎన్నికల్లో ఒక వార్డుకే పరిమితమైన పార్టీ ఈసారి కనుమరుగైపోయింది. 106వార్డులో పోటీ చేసిన టీడీపీ ఒక్కవార్డునూ దక్కించుకోలేకపోయింది.