Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్
- కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకా మందు రాష్ట్రానికి వచ్చింది. 3.72 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులతో పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానం మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి గ్రీన్చానల్ ద్వారా కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలించారు. కోఠి ఆరోగ్య కేంద్రంలో 40 క్యూబిక్ మీటర్ల వాకిన్ కూలర్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్,రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు మినహా ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు వ్యాక్సిన్ను తరలించేందుకు ఫ్రీజర్తో కూడిన వాహనాలను సిద్ధంచేశారు. వ్యాక్సిన్ రవాణా ప్రక్రియలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోఠిలో టీఎస్ ఎంఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రంలో కోటిన్నర డోసులు భద్రపర్చే అవకాశం ఉంది. జిల్లాల్లో ఉన్న కేంద్రాల్లో సైతం మరో కోటిన్నర డోసులు భద్రపరిచే సామర్థ్యం ఉండటంతో రాష్ట్రంలో 3 కోట్ల డోసులను ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచాలని సిఎస్ సోమేశ్కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకునే వారంతా అందుబాటులో ఉండేలా చూడాలనీ, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని సీఎస్ సూచించారు.
2,89,428 మంది నమోదు....
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు వైద్యారోగ్యశాఖలో 2,89,428 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1,42,706 మంది ప్రభుత్వ సిబ్బంది కాగా, 1,46,722 మంది ప్రయివేటు ఆస్పత్రుల సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో 866 కోల్డ్ చైన్ పాయింట్లను, 1213 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 1,42,706 మంది వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారిలో అత్యధితంగా హైదరాబాద్ జిల్లాలో 78,226 మంది ఉండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 2104 మంది ఉన్నారు. రంగారెడ్డిలో 26,078, వరంగల్ అర్బన్ 11,854,కామారెడ్డిలో 11,775 మంది, కరీంనగర్ 11,918, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో 14,702, నిజామాబాద్ 11,068 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో 2191, కొమురంభీం ఆసిఫాబాద్ లో 2726, నారాయణపేటలో 2190, రాజన్న సిరిసిల్లలో 2661, వనపర్తిలో 2875 మంది ఉన్నారు.
ఆస్పత్రుల వారీగా.......
వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ఎంపిక చేసిన వాటిలో ప్రయివేటు బోధనాస్పత్రులు ఆరు, ప్రయివేటు ఆస్పత్రులు 34 మొత్తం 40 ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక కేంద్రాలు 25, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు 15, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 21, ఏరియా ఆస్పత్రులు 12, జిల్లా ఆస్పత్రులు 20, ప్రభుత్వ బోధనాస్పత్రులు మొత్తం 99 ఉన్నాయి. కాగా తొలి రోజు ఈ నెల 16న 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనున్నది. గాంధీ ఆస్పత్రితో పాటు నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధానమంత్రి ఆ కేంద్రాల్లో ఉన్న వారితో ముచ్చటించనున్నారు.