Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
- ఆ చట్టాలు కార్పొరేట్ సంస్థలకే లాభం
- రైతులకు కీడు చేస్తే వ్యతిరేకిస్తాం..
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం.. రైతుల పాక్షిక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ చట్టాలు రైతుల కంటే కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూర్చేవిగా ఉన్నాయని చెప్పారు. రైతులకు మేలు చేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కీడు చేస్తే వ్యతిరేకిస్తామని అన్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరపనున్న చర్చల్లో రాష్ట్రాలకు కూడా ప్రతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పరిగూడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేవలం ఉత్తరాది రాష్టాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు తెస్తే తెలంగాణ లాంటి రాష్టాలకు నష్టం కలుగుతుందని చెప్పారు. కేంద్ర తెచ్చిన చట్టంతో రైతుల కన్నా కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రైతులు చల్లని చలిలో 45 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం ఆందోళన చేస్తున్న రైతుల పాక్షిక విజయమని చెప్పారు. తెలంగాణలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడితే, కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలబిస్తుందని విమర్శించారు. రైతులకు మేలుచేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కానీ ఈ చట్టాలు రైతుకు మేలు చేసేవిగా లేవని అన్నారు. అందులో కనీస మద్దతు ధర అంశం లేదన్నారు. కనీసం మద్దతు ధర అంశం లేకపోతే రైతుల పంట ఉత్పత్తులకు ఎవరు కొనుగోలు చేస్తారో గ్యారంటీ లేని దుస్థితి ఏర్పడనుందన్నారు. కేంద్రం రైతు ప్రతినిధులతో జరపనున్న చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వ్యవసాయం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమేనని చెప్పారు. కేంద్రం కొన్ని చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై రుద్దుతోందని చెప్పారు. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా, కేంద్రం చేతుల్లోకి తీసుకుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. కరోనా కష్ట సమయంలోనూ రూ.7515 కోట్ల నిధులు రైతుబంధు ఇచ్చామన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే కోటీ 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండే గోదాములున్నాయన్నారు. కోటీ మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే విధంగా గోదాములను అందుబాటులోకి తేవాలన్నారు. అ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ మహిపాల్, డీఏఓ గీతారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులున్నారు.