Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ రైతులపై దాడి చేస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రధాని మోడీ గుండు కొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతును రాజు చేసేందుకు 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చారన్నారు.
ఆ చట్టాలను దొడ్డి దారిన తెచ్చారు : ఎంపీ బడుగుల
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రాదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము పోరాడుతుంటే.. కార్పొరేట్ అనుకూల.. రైతు వ్యతిరేక చట్టాలపై రైతులందరూ ఉద్యమించాలని కోరారు.ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు జై శ్రీరామ్ కాదు.. జై కిసాన్ అని అనాలన్నారు. అప్పుడైనా వారికి కాస్త పుణ్యం దక్కుతుందన్నారు. జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మున్సిపల్ చైర్మెన్ ఏనబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.