Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి
- విద్యార్థుల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
- గురుకులాలు, హాస్టళ్లను తెరిచేందుకు పకడ్బందీ చర్యలు : సమీక్షా సమావేశంలో మంత్రులు సబిత, కొప్పుల, గంగుల, రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు, హాస్టళ్లు, గురుకులాలను ప్రారం భించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ అన్నారు. అయితే విద్యార్థులు హాజరు కావాలంటే వారి తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభ మవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్ల లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ తరగతులు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థుల భవితకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా వారి ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ తరగతులను నిర్వహించేందుకు తరగతి వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యాఖ్యానించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరంతోపాటు తరగతి గదులు, హాస్టళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించారు. ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్ పాఠాలు కొనసాగుతాయని అన్నారు. విద్యాశాఖ చేపట్టిన సర్వే ప్రకారం 86 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు అందుతున్నాయని వివరించారు. విద్యార్థులు ఇంటినుంచి వచ్చేటపుడే మాస్క్లు ధరించి రావాలని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, హాస్టళ్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చాలాకాలం తర్వాత గురుకులాలు, హాస్టళ్లను ప్రారంభిస్తున్నామనీ, ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి, గురుకులాలు, హాస్టళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులను ఈనెల 25 నాటికి చేరవేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వాటిలో నిద్రించే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లను ప్రారంభానికి సంబంధించి పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 25లోగా ప్రతి విద్యాసంస్థనూ తనిఖీ చేసి లోపాలను సరిదిద్ది వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, అధికారులు నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, రాహుల్ బొజ్జా, నదీమ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.