Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు మంగళవారం లేఖ రాశారు. సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. కృష్ణా బేసిన్లో విశాఖపట్నం భాగం కాదని గుర్తు ఏశారు. ఇది విజయవాడకు 350 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్కు 618 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశాలకు అధికారులు హాజరయ్యేందుకు ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంకు తరలిస్తే సీనియర్ ఇంజినీర్లు, సభ్యులు, ఇతర సిబ్బంది ప్రయాణ, వసతి ఖర్చులు పెరుగుతాయని చెప్పారు. సహాయ సిబ్బందికి ఎయిర్ ట్రావెల్ సౌకర్యం లేని కారణంగా వారు ఒకరోజు ముందే చేరుకోవాల్సి ఉంటుందనీ, తద్వారా అనవసర ఆర్థికభారం పెరుగుతుందని వివరించారు. సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు సైతం ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. అపెక్స్ కమిటీలో చర్చించకుండా ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేస్తామనడం ఎంతమాత్రమూ సరైంది కాదని మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.